అనంతగిరి/మానకొండూర్రూరల్, ఫిబ్రవరి 13: యూరియా స్టాక్ అంతా క్షణాల్లోనే మాయమైపోతుండటంతో అనుమానాలు వ్య క్తంచేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురం గ్రామానికి చెందిన రైతులకు నిరసనకు దిగారు. కోదాడ-అనంతగిరి రోడ్డుపై పురుగుల మందు డబ్బాలతో బైఠాయించారు. అనంతరం ఖానాపురం పీఏసీఎస్ ఆవరణలో వ్యవసాయ అధికారులను నిలదీశారు.
సంఘ పరిధిలోకి 444 యూరియా కట్టలు ఆన్లైన్లో పెడతామన్న సమయానికి కాకుండా ఆలస్యంగా ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతి సీజన్లో యూరియా విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం సంఘం కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామంలోని వెంకటసాయి ఫర్టిలైజర్ షాపు వద్ద సుమారు 350 మంది రైతులు శుక్రవారం యూరియా కోసం పడిగాపులు కాశారు. షాపులోకి 220 బస్తాలు వచ్చినట్టు సమాచారం రావడంతో పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. యాప్ ఓటీపీ కోసం ఎదురు చూడటానికే సమయం వృథా అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. యాప్ ద్వారా కాకుండా పాతపద్ధతిలో బస్తాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.