న్యూఢిల్లీ, అక్టోబర్ 18: లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రమంత్రి అజయ్మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం దేశవ్యాప్తంగా రైల్ రోకో చేపట్టింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు రద్దవ్వగా మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరుగంటలపాటు అన్నదాతలు రైలు పట్టాల మీదకు చేరి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. లఖింపూర్ ఖీరీలో నలుగురు రైతుల మరణాలకు బాధ్యతవహిస్తూ కేంద్రమంత్రి అజయ్మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించడంతో పాటు ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాకు కఠిన శిక్ష విధించాలన్నారు. రైతుల నిరసనల కారణంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశాలోని 184 ప్రాంతాల్లో 290 రైళ్లకు అంతరాయం కలిగింది. గమ్యాన్ని చేరేలోపునే కనీసం 118 రైళ్లు నిలిచిపోయాయి. 43 రైలు సర్వీసులను అధికారులు పూర్తిగా రద్దు చేశారు. మరో 50 సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. ఇంకో 60 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఈ జాబితాలో చండీగఢ్-ఫెరోజ్పూర్, న్యూఢిల్లీ-అమృత్సర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. ‘రైల్రోకో’ నిరసనలతో ఈస్ట్కోస్ట్ రైల్వే డివిజన్ ఆఫ్ ఒడిశా పరిధిలోని డజనుకు పైగా రైళ్లు ఆరగంట నుంచి గంట ఆలస్యంగా నడిచినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. యూపీలోని లఖింపూర్ ఖీరీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల మీదకు కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనశ్రేణి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు, జర్నలిస్టు ఒకరు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని, అతని కుమారుడిని శిక్షించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆశిష్ పోలీసుల అదుపులో ఉన్నారు.
ప్రశాంతంగా ముగిసింది: ఎస్కేఎం
దేశవ్యాప్తంగా సోమవారం చేపట్టిన రైల్రోకో ఆందోళనలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్కేఎం నేతలు ప్రకటించారు. ఎలాంటి ఆస్తినష్టం కలిగించకుండా వేలాది మంది రైతులు నిరసనల్లో పాల్గొన్నట్టు వెల్లడించారు. పంజాబ్, హర్యానాతో పాటు యూపీ, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఆందోళనలు కొనసాగినట్టు వెల్లడించారు. లఖింపూర్ ఖీరీ ఘటనలో దోషులకు శిక్ష పడేవరకు తమ పోరాటం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు.
ఆంక్షల చట్రంలో యూపీ
‘రైల్ రోకో’ నిరసనల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు సోమవారం ఆంక్షలు విధించారు. రాజధాని లక్నోలో సెక్షన్ 144 విధించారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పలువురు రైతులను పోలీసులు నిర్బంధించినట్టు ఎస్కేఎం నేతలు ఆరోపించారు. మరోవైపు, మధ్యప్రదేశ్లోని గునా, గ్వాలియర్, రెవా, బమానియా తదితర ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్న రైతులను పోలీసులు అరెస్టు చేసినట్టు రైతు నేతలు ఆరోపించారు.
రైతుల డిమాండ్లు తీర్చకపోతే బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదు
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్
రైతుల డిమాండ్లను నెరవేర్చకపోతే బీజేపీ తిరిగి అధికారంలోకి రాదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న యూపీలోని పలు గ్రామాల్లోకి బీజేపీ నాయకులు అడుగుపెట్టలేని పరిస్థితి ఉందని చెప్పారు. ‘నాది మీరట్. మా ప్రాంతంలోని ఏ గ్రామంలోకి బీజేపీ నాయకులు ప్రవేశించలేరు. మీరట్ మాత్రమే కాదు. ముజఫర్నగర్, బాగ్పట్లోకి కూడా రాలేర’ని తెలిపారు. రాజస్థాన్లోని ఝున్ఝునూ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సత్యపాల్ విలేకరులతో మాట్లాడారు. అవసరమైతే రైతుల కోసం పదవిని వదులుకుంటానని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రైతుల కోసం ప్రధాని, హోంమంత్రితో కూడా గొడవ పెట్టుకున్నానని చెప్పారు. ‘మీరు తప్పు చేస్తున్నారని ప్రతి ఒక్కరికి చెప్పాన’ని తెలిపారు. ప్రభుత్వం చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను హామీ ఇస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కానీ ఆ పని కూడా చేయడం లేదని వ్యాఖ్యానించారు.