అడ్డగూడూరు, ఏప్రిల్ 8: ధాన్యం కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై వడ్లు పోసి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఈ సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులో చోటుచేసుకుంది. అడ్డగూడూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 1న ప్రారంభించారు. ఇంకా కాంటాలు వేయడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతులు సోమవారం వడ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఇప్పటికే పంటలు ఎండిపోగా.. పండిన కొద్ది ధాన్యాన్ని కూడా అధికారులు కొనడం లేదని విమర్శించారు. వడ్లను కొనాలని ఏపీఎం వెంకటేశ్వర్లును అడిగితే కలెక్టర్ నుంచి ఆదేశాలు రాలేదని, మిల్లు ట్యాగ్ కాలేదని చెప్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు సోమిరెడ్డి పురుషోత్తంరెడ్డి, బైరెడ్డి నర్సిరెడ్డి, దాసరి బాలరాజు, పరిగెల సత్యనారాయణ, అసర్ల బీరుమల్లు, కడారి సోమన్న, బోయపల్లి కంట్లం, గజ్జెల్లి రవి, చిన్నం రాములు, దాసరి వెంకటయ్య పాల్గొన్నారు.