నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిని రైతులు ముట్టడించారు. పెర్కిట్లోని అరవింద్ ఇంటి వద్దకు ఇవాళ ఉదయం రైతులు ధాన్యంతో చేరుకున్నారు. ఆయన ఇంటి ముందు వడ్లు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులు.. ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అబద్ధపు హామీలతో మోసపూరితమైన వాగ్దానాలతో రైతులను మభ్యపెట్టాలని చూస్తే రైతుల నుంచి ఎదురు దెబ్బ తగులుతుందని మరోసారి ఎంపీ అరవింద్ విషయంలో రుజువైంది. మొదటిసారిగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి మోసం చేశాడు. ఈ క్రమంలో అరవింద్ ఏ ఊరికి వెళ్లినా.. అడుగడుగునా పసుపు రైతుల నిరసనలు ఎదురవుతున్నాయి. దీంతో ఆయన ఏ ఊరికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
అయినా కూడా అరవింద్ బుద్ధి మారలేదు. యాసంగిలో వరి ధాన్యం వేయండి.. ప్రతి గింజ కొంటామని చెప్పి రైతులను తప్పుదోవ పట్టించారు. ఇప్పుడేమో పండించిన ధాన్యాన్ని కొనకుండా.. ముఖం చాటేశాడు అరవింద్. ఈ క్రమంలో చైతన్యవంతులైన నిజామాబాద్, ఆర్మూర్ రైతులు శాంతియుతంగా ఎంపీ అరవింద్ గారి ఇంటిని ముట్టడించారు. వరి ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఎంపీ అరవింద్ ఇంటి ముందు కుప్పలుగా పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నేతలు చెబితేనే వరి వేశాము కాబట్టి ఎప్పటిలాగానే కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనిపించే బాధ్యతను ఎంపీ అరవింద్, బీజేపీ నాయకులు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో బీజేపీ నాయకులు రైతుల నుంచి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు.
బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిని ముట్టడించిన రైతులుhttps://t.co/Z33aSA3SwG
— Namasthe Telangana (@ntdailyonline) April 12, 2022