డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న కర్ణాటకలో రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బీజేపీ సర్కారు పుణ్యమా అని గిట్టుబాటు ధర లేక చెరుకు రైతులు అల్లాడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో మాండ్య చెరుకు రైతులు నిరసన బాట పట్టారు. కనీస మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ గత కొద్దిరోజులుగా మాండ్య పట్టణంలో రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నారు.
ఈ నిరసన 50 రోజులకు చేరిన సందర్భంగా గురువారం ఇలా ముఖ్యమంత్రి బొమ్మై బొమ్మకు రక్తాభిషేకం నిర్వహించారు. సిరంజితో రక్తాన్ని తీసి ప్రతిమకు అభిషేకం చేశారు. పంట ధరతో ఆటలాడొద్దని, కావాలంటే రైతుల రక్తం తీసుకోండని.. 40 శాతం కమీషన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విన్నవిస్తున్నట్టుంది కదూ ఈ చిత్రం.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సంక్రాంతికి ముందే తెలంగాణలో రైతుబంధు పండుగ మొదలైంది. పదోవిడతలో భాగంగా రానున్న యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నిధులను బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుండటంతో కర్షకుల ఆనందం అంతా ఇంతా కాదు. ఎకరంలోపు రైతులకు ముందుగా పంట సాయం అందుతుండటంతో సన్నకారు రైతుల్లో సంబురాలు మొదలయ్యాయి. రైతుబంధు డబ్బులు బ్యాంక్లో జమ కావడంతో జనగామ జిల్లా పెంబర్తి వద్ద పొలం పనుల్లో నిమగ్నమైన రైతులు ఇలా మడిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజును చేశారని, ఆయనను రైతులందరూ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని వారు చెప్పారు.