గజ్వేల్, జనవరి 28: ‘కేసీఆర్ బడా దిల్దార్ నేతా. తెలంగాణ మే అచ్చా కామ్ కియా. బహుత్ డెవలప్ కియా. హమారే పాస్ సబ్ రిసోర్స్ హై. లేకిన్ కామ్ కర్నే కా దిల్ కిసీకో భీ నహీహై. కేసీఆర్ జిందాబాద్’ అని ఒడిశా రైతు సంఘాల నాయకులు తెలంగాణ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఒడిశాకు చెందిన 130 మంది రైతులు శనివారం పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వర్గల్ మండలం సింగాయపల్లి, కోమటిబండ అటవీ ప్రాంతాలు, మిషన్ భగీరథ సంప్హౌస్, గజ్వేల్ వెజ్, నాన్వెజ్ సమీకృత మార్కెట్, మర్కూక్ రైతువేదిక,కొండపోచమ్మ రిజర్వాయర్ను సందర్శించారు. కోమటిబండ మిషన్ భగీరథ సంప్హౌస్ వద్ద మిషన్ భగీరథ రాష్ట్ర కార్యదర్శి స్మితా సబర్వాల్ ఒడిశా రైతులకు ప్రాజెక్టు గురించి క్షుణ్ణంగా వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా శుద్ధమైన తాగునీటి అందిస్తున్నట్టు తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తిగా సీఎం కేసీఆర్ ఆలోచనల రూపమేనని చెప్పారు. అంతకుముందు సింగాయపల్లి ప్రాంతంలో అడవుల పునరుత్పత్తి, రక్షణ, అభివృద్ధి చర్యలను డీఎఫ్వో శ్రీనివాస్, ఎఫ్ఆర్వో కిరణ్ ద్వారా ఒడిశా రైతులు తెలుసుకొన్నారు. గజ్వేల్ సమీకృత మార్కెట్ను సందర్శించిన రైతులకు ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ స్వాగతం పలికారు.
నదులను పొలాల్లోకి మళ్లించిన కేసీఆర్
తెలంగాణలో అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని నవనిర్మాణ్ కృషి సంఘ్ రైతు సంఘం నాయకుడు దేవీప్రసాద్ మెహరన్ అన్నారు. ఒడిశాలో అన్ని వనరులున్నా అక్కడి ప్రభుత్వాలు, నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘సీఎం కేసీఆర్ సాబ్ ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టులు కట్టారు. రైతులంతా మంచిగా పంటలు పండిస్తున్నారు. దారి పొడవునా పచ్చటి పొలాలు, అందమైన చెట్లు కనిపిస్తున్నాయి. ఏకంగా నదులనే ప్రజల వద్దకు, పొలాల్లోకి తీసుకొచ్చేంత గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులాంటివి మా దగ్గర కూడా రావాలి’ అని తెలిపారు. అనంతరం మర్కూక్ రైతు వేదికలో రైతుబంధు,రైతుబీమా, సబ్సిడీ పథకాలు, రైతువేదికల నిర్వహణ తదితర అంశాల గురించి వ్యవసాయాధికారులు ఒడిశా రైతులకు వివరించారు. తెలంగాణ సోనా వరి విత్తనాల బస్తాను తీసుకువెళ్లారు. అనంతరం కొండపోచమ్మ రిజర్వాయర్ను సందర్శించి ఆశ్యర్యచకితులయ్యారు.
తెలంగాణను చూడాలని మరోసారి వచ్చా
గతంలో దేశవ్యాప్తంగా ఉన్న మా రైతు సంఘాల నాయకులతో కలిసి తెలంగాణకు వచ్చి వెళ్లా. చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడు అడవులతో పాటు మల్లన్నసాగర్ ప్రాజెక్టును చూశాం. ఇప్పుడు కొండపోచమ్మ ప్రాజెక్టును చూశాం. రైతులకు అవసరమైన పెట్టుబడి, కుటుంబాలకు రైతుబీమాతో భరోసా, ప్రాజెక్టులతో సాగునీరు అందించే ఇంతటి గొప్ప పాలన మాకూ కావాలి. ఇంతటి సంతోషాన్ని మా రాష్ట్రంలో రైతులతో పంచుకొంటుంటే వారిలోనూ తెలంగాణ రాష్ట్రంలాగా మా దగ్గర ఎప్పుడవుతుందో అని చర్చించుకొంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బహుత్ అచ్చా లీడర్ హై.
– బీరేంద్రకర్, ఒడిశా రైతు
నదుల్ని పొలాల్లోకి తెచ్చారు
తెలంగాణలో రైతుల కోసం చేపట్టిన పథకాలు బాగున్నాయి. సీఎం కేసీఆర్ వచ్చాక రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని ఇక్కడి రైతులు మాతో చెప్పారు. ప్రత్యక్షంగా చూస్తుంటే వారు చెప్పిన దానికన్నా బాగున్నది. మిషన్ భగీరథ తాగునీటి పథకం, కొండపోచమ్మ ప్రాజెక్టు అద్భుతంగా ఉన్నాయి. నీటి కరువున్న ప్రాంతాల్లోకి ఏకంగా నదులనే తీసుకొచ్చారు. మా రాష్ట్రంలోనూ ఇలాంటి అభివృద్ధిని కోరుకుంటున్నాం.
– రమేశ్ చందోర్కర్, ఒడిశా రైతు
యాదగిరిగుట్ట అద్భుతం.. బీఆర్ఎస్ ఒడిశా నేతలు
‘యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మందిర్ అచ్చా హై.. మందిర్కే పాస్ అచ్చా హై.. ఇదర్ కా సర్కార్ మందిర్కో సుందర్ కర్దియా.. ఇతిహాస్ మే ఠహర్జాతే’ అని బీఆర్ఎస్ ఒడిశా ప్రతినిధి బృందం ప్రశంసించింది. తెలంగాణ ప్రభుత్వం ఆలయ పునరుద్ధరణను అత్యద్భుతంగా తీర్చిదిద్దిందని కితాబిచ్చింది. యాదగిరిగుట్ట ఆలయాన్ని బీఆర్ఎస్ ఒడిశా నేతలు, రైతు నాయకులు శనివారం సందర్శించారు. 25 మందితో కూడిన బృందం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం అద్దాల మండపాన్ని సందర్శించి ఆలయంలో కలియతిరిగారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవడం బాగున్నదని కొనియాడారు. పూర్తి కృష్ణ శిలతో నిర్మించిన గుడిని చూస్తుంటే స్వర్గంలోకి అడుగు పెట్టినట్టు ఉన్నదని తెలిపారు.
కేసీఆర్ సనాతన ధర్మ రక్షకుడు
సుమారు రూ.1300 కోట్లతో ఆలయాన్ని పునరుద్ధరించడం గొప్ప విషయం. ఆలయం లోపల ఆధ్యాత్మిక తన్మయత్వం పొందాం. ఎంతో అపురూపంగా నిర్మించారు. హిందూ ధర్మాన్ని రక్షించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఆయనే నిజమైన సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడు. ముఖ్యమంత్రి పేరు కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. శిల్పులతో గుడిని అందంగా తీర్చిదిద్దారు. – దిలీప్ శంకర్, బీఆర్ఎస్ ఒడిశా నేత