జైనథ్, ఫిబ్రవరి 29 : సోయా(Soya )కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్(Zainath) మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు(Soya Farmers) నాయకులతో కలిసి రాస్తారోకో(Agitation,) నిర్వహించారు. సుమారు గంటపాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేర్ లింగారెడ్డి మాట్లాడుతూ.. జైనథ్, బేల, ఆదిలాబాద్ మార్కెట్ యార్డుల్లో సోయా కొనుగోళ్ల పేరిట మార్క్ఫెడ్ ఒక రోజు ప్రారంభించి నిలిపివేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు, ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు ఎన్ఆర్ఈజీఎస్ పనులపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదన్నారు. మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందన్న నమ్మకంతో రైతులు సోయ నిల్వలను తీసుకొచ్చి పడరాని పట్లు పడుతున్నారన్నారు.
మరో వారంలో సోయా, శనగ ఉత్పత్తులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మనోహర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎం.ప్రహ్లాద్, గిమ్మ ఎంపీటీసీ కోల భోజన్న, అకోలి సర్పంచ్ కేశవ్, జైనథ్ మార్కెట్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ పాల్గొన్నారు.