జనగామ, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ‘సర్కారు వారి పాట రూ.1,700, రూ.1,823, రూ.1,900 ఏక్ బార్.. దో బార్.. తీన్ బార్’.. ఇదీ రైతుకు దక్కిన ధర. వారం రోజుల ఆందోళన తర్వాత మంగళవారం జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ-నామ్ ఆన్లైన్ ద్వారా ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లలో అన్నదాత శ్రమకు దక్కిన ప్రతిఫలం ఇది. ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.2,200 చెల్లించాల్సిన ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి ధర తగ్గించి రైతును దగా చేస్తున్నది.
క్వింటాకు రూ.500 బోనస్ అంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు దేవుడెరుగు అసలు ధరకే రూ.500 చిల్లు పడింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అంగట్లో వేలంపాట ద్వారా వ్యాపారులు నిర్ణయించిన ధరకే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితిని సృష్టించారు. ‘అన్నదాతకు ఏ కష్టం రానివ్వం.. పండిన ప్రతి గింజకూ మద్దతు ధర చెల్లిస్తాం.. ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయ్’.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కార్చిన మొసలి కన్నీరు.
ఎంఎస్పీ క్వింటాకు రూ.2,200కు తక్కువకు ఎవరూ కొనొద్దు అంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన తర్వాత మంచి ధరకు అమ్ముకోవచ్చని ఆశపడ్డ రైతును ప్రభుత్వం మళ్లీ దగా చేసింది. కాంగ్రెస్ పాలనలో రైతుకు మద్దతు ధర దక్కడం మిథ్యే అని తేలింది. జనగామ వ్యవసాయ మార్కెట్లో వారం రోజులుగా ధాన్యం రాసుల వద్ద రైతులు ఇంటిల్లిపాది పడిగాపులు కాస్తూ.. రోజూ నిరసనలు, ఆందోళనలు చేసిన ఫలితంగా ఎట్టకేలకు మంగళవారం జనగామ మార్కెట్లో ఆన్లైన్ కొనుగోళ్లు చేశారు.
మార్కెట్ యార్డుకు వస్తే మద్దతు ధర దక్కుతుందని రవాణా ఖర్చులు ఇతరత్రా వ్యయప్రయాసలకు ఓర్చి పడిగాపులు కాసిన రైతు మండే ఎండలో కష్టాన్ని భరించలేక చివరికి తక్కువ ధర అయినా సరే ఈనామ్ ద్వారా అమ్ముకొనేందుకు ముందుకు వచ్చాడు. దీంతో ఉదయం రైతులు మాయిశ్చర్, తాలు, మట్టి తనిఖీ చేసి ఆన్లైన్లో ధరలను కోడ్ చేశారు.
ట్రేడర్లు, వ్యాపారులు ధాన్యానికి పెట్టిన ధర కనిష్ఠంగా రూ.1,700 నుంచి గరిష్ఠంగా రూ.1,923 అయితే మధ్యస్థంగా దక్కిన ధర రూ.1,823 మాత్రమే. తేమ శాతం ఆధారంగానే ఆన్లైన్లో ధర నిర్ణయం జరుగుతుందని అధికారులు చెబుతున్నా.. ఒకటి, రెండు రాసుల ప్రామాణికంగా.. నిర్ణీత పద్ధతిలో మాయిశ్చర్ ఉన్న ధాన్యానికి కూడా మద్దతు ధర ఇవ్వడంలేదు. ఈ-నామ్ ట్రేడింగ్లోనూ వ్యాపారులు జట్టుకట్టి మరీ ధాన్యం ధరలను నిర్ణయిస్తుంటే నిలువరించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారు.