దేవరుప్పుల, మార్చి 12: ‘ఒక్క తడికి నీరిస్తే పంటలు పండేవి.. నోటికాడి బుక్క నేలపాలైంది.. కనికరం లేని సర్కారును మునుపెన్నడూ చూడలేదు’ అంటూ జనగామ జిల్లా దేవరుప్పులలో రైతులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు జాతీయ రహదారిపై ధ ర్నా చేశారు. పదేండ్లుగా నీటి కరువును చూడలేదని, జలాశయాల్లో నీరు ఉన్నా ఇవ్వలేని దద్దమ్మ సర్కారు అంటూ మండిపడ్డారు. చెరువులు నింపాలని, ఎండిన పంటలకు ఎకరాకు 20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు తాత్కాలిక ఉపశమనాలతో కాలం గడుపుతోందని విమర్శించారు.
సాగునీళ్లు ఇవ్వకపోతే ముట్టడి
పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. మంగళవారం కరీంనగర్ మండలం చామనపల్లికి చెందిన రైతులు గ్రామంలోని ఎస్సారెస్పీ డీ- 87 కెనాల్ సమీపంలో రోడ్డు వద్ద ధర్నా చేశారు. ఎస్సారెస్పీ డీ 87 ద్వారా చామనపల్లిలోని రాజసముద్రం చెరువులోకి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నీరందకపోతే దాదాపు వెయ్యి ఎకరాల పంట నష్టపోతామని రైతులు వాపోయారు. కాలువల్లో నీళ్లు వదలకపోతే కరీంనగర్ కలెక్టరేట్, ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దాదాపు 200 మంది రైతులు పాల్గొన్న ఈ ఆందోళనను పోలీసులు జోక్యం చేసుకుని విరమింపజేశారు.