Telangana Decade celebrations | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: ఎడ్ల బండ్ల ఊరేగింపులు, రైతన్నల ఆనందోత్సాహాలు, రైతు వేదికల్లో కోలాహలం, మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులతో సహపంక్తి భోజనాలు.. ఇది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో కనిపించిన వాతావరణం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతు లు, ప్రజాప్రతినిధులు రైతు వేదికల వద్దకు తరలివచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రైతు పథకాలపై రైతులకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాకముందు తాము పడ్డ పరిస్థితులను తలుచుకొని బాధపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ములుగు జిల్లా చల్వాయిలో మంత్రి సత్యవతి, కరీంనగర్ జిల్లా దుర్షేడ్లో మంత్రి గంగుల కమలాకర్, జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలలో మంత్రి ఎర్రబెల్లి, మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో మంత్రి మల్లారెడ్డి, ఖమ్మం జిల్లా రఘునాథపల్లిలో మంత్రి పువ్వాడ, రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతు దినోత్సవంలో పాల్గొన్నారు.
రైతు దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లిలో ఎడ్లబండి నడుపుతున్న రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి. రైతు సంక్షేమమే ధ్యేయంగా, దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని స్పష్టంచేశారు.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వన్నేల్ బీలో ఎడ్లబండిపై రైతు దినోత్సవానికి వెళ్తున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు రైతాంగానికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నది. తెలంగాణ బాపు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే తెలంగాణకు తొమ్మిదేండ్ల కిందటి పరిస్థితే వస్తది. అన్నదాతలకు మేలు చేకూరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలి.
రైతు దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కోడూరులో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ పాలన బాగుందని సీఎం కేసీఆర్కు దండం పెడుతున్న గిరిజన మహిళ.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో మన రైతులు గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ మాడల్ అంటే ఏమిటని ఢిల్లీలోని జాతీయ మీడియా మిత్రులు నన్ను అడిగిండ్రని.. నదీ జలాలను 80 మీటర్ల నుంచి 610 మీటర్లపైకి ఎత్తిపోసి పొలాలకు నీళ్లు ఇవ్వడం.. ఐదేండ్లలో 65లక్షల మంది రైతులకు 65 వేల కోట్లు ఇవ్వడం.. ప్రతీ రైతుకు బీమా, ప్రతీ ఎకరానికి నీళ్లు అందించడమే తెలంగాణ మాడల్ అని చెప్పానని గుర్తుచేశారు. త్వరలో దేశమంతా ఇదే మాడల్ విస్తరిస్తుందని అన్నారు.
నల్లగొండ జిల్లా ఉరుమడ్ల రైతు దినోత్సవంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పాల్గొన్నారు. సాగైనా, సంక్షేమమైనా, అభివృద్ధి రంగమైనా మరేదైనా.. దేశంలో తెలంగాణే టాప్ అని పేర్కొన్నారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలి. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి.
నిర్మల్ మండలం ఎల్లపెల్లిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ విప్లవాత్మక పథకాలతో స్వరాష్ట్రంలో సాగును పండుగలా చేసుకుంటున్నాం. మన పథకాలు దేశానికి దిక్సూచీలా మారాయి. కేసీఆర్కు ప్రజలు మద్దతుగా నిలవాలి.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లి మండలం కొత్తూరు నుంచి కాకర్లపల్లి వరకు నిర్వహించిన భారీ ట్రాక్టర్ల ర్యాలీ
రైతు దినోత్సవం సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచర్లలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రైతన్నలకు భోజనం వడ్డిస్తున్న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
రైతు దినోత్సవం సందర్భంగా యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో రైతుల కోసం చేసిన వంటలను పరిశీలిస్తున్న సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు
మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం బూర్గుపల్లిలో రైతు ఉత్సవాల్లో డప్పు కొడుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి