పెన్పహాడ్, మార్చి 27: ‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి చెరువులను నింపారు. దీంతో పెన్పహాడ్ మండలంలోని రాయి చెరువు నాలుగేండ్లపాటు నీటితో కళకళలాడుతూ మత్తడి దుంకింది.
ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నది’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మినీ రిజర్వాయర్ గుర్తింపు ఉండి ఎండిపోయిన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారంలోని రాయి చెరువును బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాయి చెరువుతోపాటు చేతికొచ్చిన పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం, జిల్లా మంత్రులైన ఉత్తమ్, కోమటిరెడ్డి నిర్లక్ష్యమేనని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్షతో చెరువులు నింపకుండా రైతులకు శిక్ష వేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికీ నెరవేర్చలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లతో సంబంధం లేకుండా నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని, ఈ వంద రోజుల్లో కనీసం 50 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే పోచంపహాడ్ నుంచి పెన్పహాడ్ మండలానికి నీళ్లు వచ్చేవని, ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సాగు చేసిన 3 లక్షల ఎకరాలు పూర్తిగా ఎండిపోయాయని, 2014 నాటి పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయడంతోపాటు రైతుబంధు, ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.