వనపర్తి, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): అన్నం పెట్టే అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాలు సోమవారం వనపర్తి నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. 10 వేల మంది రైతులతో 41 రైతు వేదికల్లో ఒకేసారి రైతు సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో వేదికలో 200 నుంచి 500 మంది హాజరవుతారని చెప్పారు. ఆదివారం మంత్రి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. 2014కు ముందు, తర్వాత తెలంగాణ వ్యవసాయం, రైతుల పరిస్థితులపై చర్చ, వ్యవసాయంలో తెలంగాణ విజయాల గురించి రైతుల దృష్టికి తీసుకొస్తామని చెప్పారు. పంట కొనుగోళ్లు, పంట మార్పిడి ఆవశ్యకత, ఎరువుల వాడకం, మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన, చర్చ జరుగుతుందని తెలిపారు.