చండ్రుగొండ, ఏప్రిల్ 30 : తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమను నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం లారీలకొద్దీ ఎగుమతికి సిద్ధంగా ఉన్నదని, అయినా మిల్లర్లు కొర్రీలు పెట్టడం వల్ల కాంటాలు సక్రమంగా జరగడం లేదని మండిపడ్డారు.
క్వింటా ధాన్యానికి 5 నుంచి 7 కిలోల వరకు అదనంగా కాంటా వేస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. ఇంత జరుగుతున్నా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిల్లర్ల దోపిడీ ఆపకపోతే రోడ్డెక్కుతామని హెచ్చరించారు.