మహబూబ్నగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విద్యుత్తు రంగం ప్రైవేటీకరణతో ఉద్యోగులతోపాటు రైతులకు కష్టాలు తప్పవని తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ సాయిబాబు అన్నారు. విద్యుత్తు శాఖలో ఎన్ని యూనియన్లు ఉన్నా 1104 యూనియన్.. ఉద్యోగులు, కార్మికుల తరఫున విద్యుత్తురంగ ప్రైవేటీకరణను అడ్డుకొనేందుకు పోరాటం చేస్తుందన్నారు. శనివారం మహబూబ్నగర్లోని యూనియన్ కార్యాలయంలో పలువురు 1104 యూనియన్లో చేరారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. విద్యుత్తు రంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో కష్టపడి రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించాలని కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. వ్యవసాయానికి కరెంటు మీటర్లు రాకుండా కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.