యాసంగి వడ్లను అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. ప్రతికూల వాతావరణంతో పంట తక్కువ పండినా.. సకాలంలో కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావడంలేదు. మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా.. రెండు వారాలైనా వడ్ల కాంటాలు జరగడం లేదు. రోజుల తరబడి పడిగాపులు కాసి అష్టకష్టాలు పడి కొనుగోలు కేంద్రంలో నుంచి ధాన్యం లోడ్ ఎత్తినా.. మిల్లుకు చేరేది నమ్మకం లేదు. సాక్షాత్తు కలెక్టర్ చెప్పినా మిల్లర్లు లోడ్ దించుకునే పరిస్థితి లేదు. హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు క్వింటాలు వడ్లు కూడా మిల్లులకు చేరలేదంటే అతిశయోక్తి కాదు.
Warangal | వరంగల్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొనుగోలు, కాంటాలపై అధికారులకు స్పష్టత లేకపోవడంతో వడ్ల రాశులు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. హనుమకొండ జిల్లాలో 18 బాయిల్డ్ మిల్లులు, 40 రా రైస్మిల్లులు ఉన్నాయి. 14 మిల్లులకు వడ్లు మిల్లింగ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొనుగోలు కేంద్రానికి వస్తున్న వడ్లను అధికారులు కాంటా పెట్టి మిల్లుకు తరలిస్తారు. రైస్మిల్లర్లు ఈసారి తాలు సాకు చెప్పి వడ్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వారం క్రితం కమలాపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు అన్యాయం చేయవద్దని, తాలు కారణంగా చూపి కాంటాలో కోత పెట్టవద్దని మిల్లర్లను, అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సందర్శన తర్వాత స్థానిక అధికారులు అప్పటికప్పుడు లారీలో వడ్లను నింపి మిల్లుకు తరలించారు. నాణ్యత లేదని కారణం చెప్పి మరునాడే వడ్లను తిరిగి కొనుగోలు కేంద్రానికి పంపారు.
సాక్షాత్తు కలెక్టర్ ఆదేశాలను కూడా మిల్లర్లు పట్టించుకోలేదు. కొనుగోలు కేంద్రంలోనే రైతులు వడ్లను శుద్ధి చేసి(ప్యాడీ క్లీనింగ్) ఇస్తేనే తీసుకుంటామని మెలిక పెట్టారు. కమలాపూర్లో ప్యాడీ క్లీనింగ్ చేసి పంపిన ధాన్యాన్ని కూడా మిల్లర్ తిరస్కరించి పంపించడంపై రైతులు నిరసన వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రంలో పోసిన వడ్లను శుద్ధి చేయాలంటే ఎలా ? అని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. వడ్లు ఎక్కువ ఉన్న రైతులు ఎన్ని రోజులు కొనుగోలు కేంద్రంలో ఉండి శుద్ధి చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల సాకులు, రైతుల ఇబ్బందులతో కాంటాలు నిలిచిపోయాయి. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే ఉంటున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది ఉండడంతో రైతులు నేరుగా వ్యాపారులకు, మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి తిరిగి తీసుకెళ్తే రవాణాచార్జీల భారం పడుతున్నది. కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రకం వడ్ల ధర కింటాకు రూ.2,203, సాధారణ రకం వడ్లు కింటాకు రూ.2.183గా ఉన్నది. కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం కాంటాలు మొదలు పెట్టకపోవడంతో రైతులు రూ. 200 తక్కువకు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తున్నది.
బోనస్ తప్పించుకునేందుకు..
వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ ఆ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను అమ్మిన రైతులకు మాత్రమే బోనస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించిన రైతుల పంటకు బోనస్ రాదు. ఇలా అయితే వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న రైతులు క్వింటాలుకు రూ. 700 నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలనుకుంటే..కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను మిల్లులకు తరలించే ప్రక్రియను 5 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో కొనుగోలు కేంద్రానికి 40 వాహనాలను కేటాయించారు. రవాణా కాంట్రాక్టర్లు ఇప్పటి వరకు వాహనాలను సమకూర్చలేదు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదని, అందుకే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు జరగడంలేదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ఎక్కడి కుప్పలు అక్కడే
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. టెంట్లు, తాగునీటి వసతి, కూలీల కోసం షెడ్డు ఏర్పాటు చేయలేదు. ఓవైపు ఎండలు దంచి కొడుతుండగా.. బుధవారం పలు చోట్ల అకాల వర్షం ధాన్యం కుప్పలను కకావికలం చేసింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బండనాగారంలో ధాన్యం ఇలా మట్టిపాలైంది. తలదాచు కోవడానికే దిక్కులేని రైతు.. కండ్ల ముందు
ధాన్యం తడిసి ముద్దవుతుండటంతో బోరుమంటున్నాడు.
క్లీనింగ్కు రైతులు ఇష్టపడటం లేదు
గతంలో లాగా కాకుండా కొనుగోలు కేంద్రాల నుంచి తరలించే వడ్లను కచ్చితంగా క్లీనింగ్ చేసి పంపించాలని మిల్లర్లు నిబంధన విధించారు. వడ్లను క్లీనింగ్ చేయించి మిల్లుకు పంపించాలని అధికారులు మాకు ఆదేశాలు ఇచ్చారు. రైతులు ప్యాడీ క్లీనింగ్కు నిరాకరిస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ప్యాడీ క్లీనింగ్ ఎలా చేస్తామని రైతులు అంటున్నారు.
– పాములపర్తి రత్నకుమారి, సెంటర్ నిర్వాహకురాలు
పది రోజులయితాంది
రెండు వారాల కింద వరి కోపించిన. నాలుగు రోజులు కల్లంలోనే వడ్లు ఎండినయి. కొన్ని వడ్లను శాంపిల్గా తెచ్చి తేమ శాతాన్ని చూపించాను. సరిపోతుందని చెప్పడంతో పది రోజుల కింద వడ్లను తెచ్చి కొనుగోలు కేంద్రంలో పోశిన. ఇక్కడ పందులు, కోతులు ఉన్నయి. ఎండలో కావలి ఉండుడు కష్టమైతాంది. ఇక్కడి నుంచి ఒక్క బస్తా కూడా మిల్లుకు పోలేదు.
– నాగెల్లి మణెమ్మ, రైతు, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా
ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం
కొనుగోలు కేంద్రానికి తెచ్చిన వడ్లను క్లీనింగ్ చేసిన తర్వాతే రైస్మిల్లుకు తరలించాలని ప్రత్యేకమైన ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే మిల్లుకు పంపించాలని ఉన్నతాధికారులు మమ్మల్ని ఆదేశించారు. ఆ తరహాలోనే వడ్లను మిల్లులకు తరలిస్తాం.
– కల్యాణి, ఏఈవో, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా
పట్టుడు మాతోటి అయితదా
మూడెకరాల్లో పండిన వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చి వారం అయితాంది. మాపటికి కూలోళ్లను పెట్టి దగ్గర చేస్తున్న. రోజూ ఇదే పని అయితాంది. ఇప్పడు కొత్తగా వడ్లను తూర్పార పట్టి పంపిస్తేనే తీసుకుంటమని సార్లు చెప్తుండ్రు. ఈ వడ్లను పట్టేది లేదు. అవసరం అనుకుంటే అడ్డికి పావుసేరు అమ్ముకుంట. ఎండకాలంల అంత పని మాతోని గాదు.
– నరిగె రాధిక, రైతు, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా