కొత్తపల్లి, జూన్ 17 : రేవంత్ పాలనలో తెలంగాణ రాక ముందు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే మృగశిర కార్తె దాటుతున్నా నారుపోసేందుకు నీళ్లు లేక అన్నదాతలు తండ్లాడాల్సిన దుస్థితి ఉన్నది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు గ్రామాల ప్రజలకు వరదకాలువ నుంచి నీరు వస్తేనే నారు పోసేందుకు అవకాశం ఉంటుంది. కానీ, కాంగ్రెస్ సర్కార్ ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో వరద కాలువ నుంచి సాగునీరు విడుదల కాక, కొత్తపల్లి మండల రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బుధవారం బద్దిపల్లి గ్రామంలోని సాగునీటి కాలువలను పరిశీలించారు. అనంతరం రైతు వేదిక వద్దకు రాగానే.. గ్రామ రైతులు వచ్చి తమ బాధలను ఏకరువు పెట్టారు. ‘కేసీఆర్ హయాంలో ఏనాడూ మేం నీటికి కోసం ఇబ్బందులు పడలేదు. గతంలో వరద కాలువ ఏడాదిపాటు నిండుకుండలా ఉండేది. వరదకాలువ తూము నుంచి సాగునీరు ఇస్తేనే మా ఏడు గ్రామాల రైతులు నారు పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీళ్లు విడుదల చేసేలా చూడాలి’ అని రైతులు మాజీ మంత్రి గంగులతో వేడుకున్నారు.
రైతులు కోరుతున్నట్టు వారం రోజుల్లో వరదకాలువ నుంచి సాగుకోసం నీటిని విడుదల చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. అందుకోసం సర్కార్కు, అధికారులకు వారం గడవు ఇస్తున్నామని అల్టిమేటం జారీచేశారు. ఆ లోగా సాగునీరు విడుదల చేయకపోతే రైతులతో కలిసి వరద కాలువ తూముల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా తాము సిద్ధమేనని స్పష్టంచేశారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకతను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.