నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 7: మహిళాబంధు సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన సోమవారం కల్యాణలక్ష్మి లబ్ధిదారుల ఇండ్లకు బాజాభజంత్రీలతో వెళ్లి చెక్కులను అందజేశారు. మహిళలకు చీరలు పెట్టిన ప్రజాప్రతినిధులు వారితో సెల్ఫీలు దిగారు. పారిశుద్ధ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఉపాధ్యాయులు, మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించారు. తమ బిడ్డలకు మేనమామలా మారిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మహిళలు క్షీరాభిషేకాలు చేశారు. బతుకమ్మలు, బోనాల ర్యాలీలు, ఆటల పోటీలు నిర్వహించి, సంక్షేమ పథకాలపై ప్లకార్డులు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళాబంధు సంబురాలు అంబరాన్నంటాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి లబ్ధిదారులకు కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 15వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు బాజాభజంత్రీలతో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పెద్దపల్లి పట్టణంలో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి చెక్కులు అందజేశారు. జగిత్యాల పట్టణంలో 16 మంది లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీచేశారు. హనుమకొండ జిల్లా పరకాలలో మహిళా ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. పలువురికి సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించారు.
కాలానుగుణంగా మహిళల్లో మార్పు రావాలని మిస్ ఆసియా రష్మీ ఠాకూర్ పిలుపునిచ్చారు. మహిళాదినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2కే రన్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి జెండా ఊపి 2కే రన్ను ప్రారంభించారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు. ప్రతి రంగంలో మహిళలు పురుషులతో సమానంగా రాణించాలని రష్మీ ఠాకూర్ ఆకాంక్షించారు.
ఆర్మూర్/ఖలీల్వాడి, మార్చి 7: కేసీఆర్ వంటి దమ్మున్న ముఖ్యమంత్రి దేశంలోనే లేరని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏ జీవన్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా పెర్కిట్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సోమవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళ, బీడీ కార్మికుల పింఛన్ల లబ్ధిదారులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పేరుతో పథకాలు అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వం వారికిచ్చే గౌరవమని అభివర్ణించారు.