CM KCR | సుల్తానాబాద్ వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను అదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రతి ఎకరాకు రూ.10 వేలు ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు గురువారం ఆయన చిత్రపటాలకు రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకాలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు ఉన్నతంగా బతకాలని ఆకాంక్షించే ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతులకు నష్టం రానివ్వడని ఎమ్మెల్యే తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలోనూ బీఆర్ఎస్ నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహమూబాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి, పంట నష్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఇంత వరకు ఎన్నడూ లేనివిధంగా ఎకరానికి రూ.10వేల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదలకు సంబంధించిన జీవో జారీ చేసిందంటూ కరీంనగర్లో జీవో కాపీని అందించారు. పంట నష్టం దెబ్బతిందని రైతులు నారాజ్ కావొద్దని సూచించారు. ‘రాష్ట్ర జీడీపీ పెరుగుతుందని, పల్లెలన్నీ సుఖ సంతోషాలతో ఉన్నాయన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మస్థయిర్యం కోల్పోవద్దని.. మీ వెంట కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఉంటుందని, రైతులు ఆత్మస్తయిర్యం దెబ్బతీసుకోకుండా నిలబడి ఉండాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.