నల్లగొండ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన ఆందోళనల బాటపట్టారు. ఉదయం నుంచే గ్రామాల్లో రైతులు చావు డప్పు వేస్తూ కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు కల్లాల వద్దే వరిగడ్డితో దిష్టిబొమ్మను రూపొందించి తగులబెట్టారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఆందోళనల అనంతరం ఉదయం 11 గంటల నుంచి ముఖ్య కూడళ్లలో ధర్నాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.త్రిపురారం మండలంలోని బడ్డాయిగడ్డలో వరి కళ్లాల వద్ద రైతులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురంలో రైతులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాల్చివేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు మండలం రహీంఖాన్పేటలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గోసాయిపల్లిలో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. వెంటనే వడ్లు కొనాలని డిమాండ్ చేశారు.
వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతీరుకు నిరసనగ నాగర్కర్నూల్ జిల్లాలో గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తున్నది. బీజేపీ శవయాత్ర, ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేశారు.
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ఓగులపూర్లో టీఆర్ఎస్ శ్రేణులు చావు డప్పు కొడుతూ వడ్ల కొనుగోలుపై కేంద్రం తీరుపై నిరసన తెలిపాయి. పెగడపల్లి మండలంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.