భీంపూర్, జనవరి 10: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటిలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడిపెల్లి రమేశ్ (50) పన్నెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. పెట్టుబడికి 5 లక్షలు అప్పు చేశాడు. దిగుబడి వచ్చే పరిస్థితి లేక మనస్తాపానికి గురయ్యాడు.
ఆయన భార్య దేవమ్మ, కొడుకు వెంకటస్వా మి, కోడలు బుధవారం పత్తి ఏరడానికి వెళ్లారు. ఏరిన దూదిని ఇంటికి తీసుకెళ్లడానికి రమేశ్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. పక్కింటి వారికి ఫోన్ చేసి రమేశ్ను రమ్మని చెప్పారు. పక్కింటి వారు ఇంటికి వెళ్లి చూడగా ఉరేసుకొని విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని బోరున విలపించారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు.