Telangana | ఫణికర మల్లయ్య తెలంగాణలో ఈ పేరు తెలియని వారు ఉండరు. కరడుగట్టిన సమైక్యవాది చంద్రబాబును ఆయన కడిగేసిన తీరు ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోం. ‘మా తెలంగాణ మాకిత్తె మా బతుకేదో మేం చూస్కుంటం’ అని గళమెత్తి నినదించాడు. ఆ మాట అన్ననాడు తెలంగాణ వస్తే తన బతుకు ఎలా ఉంటుందోనని ఊహించుకున్నాడో.. అంతకన్నా బాగుందని ఇప్పుడు చెబుతున్నాడు. ‘తుమ్మలు మొలిచిన కాల్వల్లో… నీళ్లు దుంకుతున్నయ్! పడావు పడ్డ పొలాల్లో.. పంటలు పండుతున్నయ్..’ అని చెబుతున్న వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన ఫణికర మల్లయ్యను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. ఆ విశేషాలివి..
పదిహేనేండ్ల కిందట చంద్రబాబును నిలదీశారు కదా! అసలు ఆ రోజు ఏం జరిగింది?
గప్పట్ల చంద్రబాబు ఓ సారి మా రాయపర్తికి వచ్చిండు. నేను, ఇంక శానమంది కూలీలం కల్లం కాడ పనిచేసుకుంటున్నం. ఇంతల మందీమార్బలంతో చంద్రబాబు మా తానికొచ్చిండు. ‘మీలో ఎవరైనా మాట్లాడతారా?’ అని అడిగిండు. నేను మాట్లాడతనన్న. ‘ఏం కావాలని’ అడిగిండు. ‘ఏమున్నదయ్యా మా తెలంగాణ మాకిత్తె మా బతుకేదో మేమే చూసుకుంటం’ అని చెప్పిన. గింతే జరిగింది. తెలంగాణ వచ్చినాంక నిమ్మలమైన.
తెలంగాణ 2014 ముందు ఎలా ఉండే? ఇప్పుడెలా ఉన్నది?
గప్పటికీ, గిప్పటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. అప్పుడేం ఉండే.. కరువు తప్ప! నీళ్లుండేవా కాదు. బాయిల నీళ్లు పాతాళంలోతు పోతుండే. బోర్లు పడకపోయేది. యాడనో ఓ చోట బోరువడ్డా.. జల మధ్యలనే ఆగిపోవు. కరెంటు ఎప్పుడొస్తదో తెల్వకపోవు. రాత్రి బాయికాడ పంటుంటిమి. ఓ రాత్రి కరెంటు అచ్చిందని మోటర్ చాలు చేసినమో లేదో.. మళ్లీ పోయేది. నెలకోపారి మోటర్ కాలిపోతుండె! పారిన మడే పారుడు.. ఎన్క చేలు తడందక ఎండుడు! దేవునికి మొక్కి మక్కజొన్న, జొన్న, పత్తి గిట్ల వానలకు పండే పంటలనే ఏసేటోళ్లం.
అప్పుడు చెరువుల కింద వ్యవసాయం ఎలా ఉండేది?
కాలం సక్కగైతే.. చెరువు నిండంగనే కట్ట తెగిపోతుండే! రెండు దినాలల్ల చెరువు వట్టిపోతుండె! గిప్పుడున్నట్టు చెర్లు గప్పుడు ఏమున్నయ్. తాంబాలమంత ఉంటుండే! పూడిక తీసేటోడేడి? చెరువు నిండా తూటి పొదలే! కాలం తీరు వానలు వడ్తే.. చెరువు కింద దొడ్డొడ్లు పండించేటోళ్లం. అప్పట్లో జనాలకు పొద్దున తింటే మాపటికి ఉండకపోవు. గట్క దొరుకుడు గిన కష్టమే ఉంటుండే! అన్నం తిన్నపూట పండుగన్నట్టు!!
ఇప్పుడు చెరువుల పరిస్థితి మారిందా..?
నేను చెప్పుడెందుకు.. కండ్లముందే ఉంది కదా ముచ్చటంతా! తెలంగాణ అచ్చినాంక శాన జరిగినయ్. మా చెరువులు బాగువడ్డయ్. కాల్వలు పూడికలు తీసిన్రు. యాసంగికి కాల్వల నుంచి ప్రాజెక్టు నీళ్లు చెర్లకొస్తున్నయ్. మునుపు వానకాలంలో కూడ నీళ్లు కనపడని చెరువులు ఇప్పుడు ఎండకాలంలో మత్తడి పోత్తాన్నయ్. ఏ బాయిల జూడు.. నీళ్లు పైకే ఉన్నయ్. మోటర్ ఎయ్యకుండనే బోర్ల కెంచి నీళ్లు దుంకుతన్నయ్.
కరెంటు సరఫరా మెరుగైన తర్వాత రైతులు ఆశించిన ప్రయోజనం పొందారనుకోవచ్చా?
తెలంగాణ అస్తె కరెంటు ఉండదని కాంగ్రెసోళ్లు చెడ మాట్లాడిన్రు. కానీ, కేసీఆర్ సారు అవన్నీ పిచ్చికూతలని నిరూపించిండు. రాష్ట్రం అచ్చిన ఏడాది సంది కరెంటు 24 గంటలు ఉంటున్నది. ఎప్పుడు కట్క ఏస్తే అప్పుడు బోర్ల నుంచి నీళ్లు దుంకుతున్నయ్. ఇగ రైతులు ఊకుంటరా. ఉన్న భూమిని పొతం చేసిన్రు. ఒక్కొకరు ఎంత భూమి ఉంటే అంత భూమిని సాగు చేస్తున్నరు. బగాయితీలను కూడా కొందరు పొలం చేసిన్రు. రెండు పంటలు పండిస్తున్రు. ఇప్పుడెటు చూసిన పచ్చని పంటలే కండ్లవడ్తున్నయ్. అందరు సంబురంగ ఉన్నరు. సంతోషమనిపిస్తున్నది. తెలంగాణ వస్తే ఏమొస్తదన్నోళ్లు జరిగింది చూసి ముఖం చాటేస్త్తున్రు.
వ్యవసాయానికి కరెంటు 24 గంటలు అవసరం లేదు, 3 గంటలిస్తే సరిపోతుందని కాంగ్రెస్ అంటున్నది కదా..?
కాంగ్రెసోళ్లకు కరెంట్ ఇచ్చుడు తెల్వది. అప్పటి పరేషాన్లు మర్సిపోయేటియా! ఆరేడు గంటలిస్తమని చెప్తుంటిరి, రెండుమూడు గంటలొస్తే ఎక్వుంటుండె! మళ్లీ ఇచ్చుడే మూడుగంటలు అని సెప్తున్నరంటె, రెండు గంటలు గిన ఇయ్యరన్నట్టు. మూడు గంటల కరెంటు రైతులకు సరిపోదు. మల్లా ఎన్కటి రోజులు మోపైతయి. ఇరవైనాలుగ్గంటలు ఉండాలె. రైతుబంధు శాన అక్కరకొత్తంది. గతంలో పంట పెట్టుబడి కోసం పైసలు మిత్తీలకు తెచ్చుకునేది. పండిన పంటంతా అప్పు కిందికే పోతుండె. బక్క రైతు కాలం చేస్తే ఆల్ల కుటుంబం ఆగం కాకుండా రైతుబీమా ఆదుకుంటున్నది. ఇట్ల మస్తు చెప్పొచ్చు. మల్లా కేసీఆర్ అస్తనే.. గివన్నీ ఉంటయ్. ఇంతకన్న మంచిగైతయ్.
…? వేముల రాజేశ్వర్ రావు