శంకరపట్నం/బోనకల్లు, మే 6 : కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యాన్ని మండుటెండలో కుప్పగా చేస్తూ వడదెబ్బతో రైతు కుప్పకూలిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల చైర్మన్ కొయ్యడ పరశురాములు తండ్రి ఐలయ్య (65) ఆరెకరాల్లో వరి సాగు చేశాడు. వరి కోసి గద్దపాక కొనుగోలు కేంద్రంవద్ద ఆరబెట్టాడు. మంగళవారం ఈదురుగాలులతో మబ్బులు రావడంతో ధాన్యం తడుస్తుందనే ఆందోళనతో ఎండలోనే ధాన్యాన్ని కుప్పగాచేశాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి ధాన్యం రాశిపై కుప్పకూలాడు.
కుటుంబసభ్యులు శంకరపట్నంలోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ బుధవారం గద్దపాకకు వెళ్లి, రైతు మృతదేహంవద్ద నివాళులర్పించి పాడె మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో రైతుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయని వాపోయారు. ఐలయ్య ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసినప్పటికీ తూకం వేయకపోవడంతో వడ్ల కుప్పపైనే పడి ఎండదెబ్బ తగిలి మరణించడం దారుణమని విచారం వ్యక్తంచేశారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఐలయ్య మృతికి ఎమ్మెల్యే కవ్వంపల్లి, ప్రభుత్వం బాధ్యత వహించి, రూ.కోటి ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం సీతానగరంలో కేశగాని కృష్ణయ్య (60) రోజువారీ పనుల్లో భాగంగా బుధవారం పొలానికి వెళ్లాడు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో పనులు ముగించుకొని ఇంటికి చేరుకుని సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. కృష్ణయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు.