హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 10: ట్రాన్స్ఫార్మర్ వద్ద గడ్డికోస్తున్న రైతు కరెంట్ షాక్తో మృతిచెందాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్లో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ముద్రబోయిన రాజు (49) మంగళవారం సాయంత్రం తన పొలం గట్టున గడ్డికోస్తూ అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదవశాత్తు తగిలి కరెంట్ షాక్కు గురై మరణించాడు. చీకటిపడినా రాజు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూసేసరికి విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి కుమారుడు రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ సీఐ రమేశ్ తెలిపారు. కాగా రాజుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.