నర్సంపేట, జూన్ 22: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేటలో జరిగింది. రైతు బూరుగు చిన్న సాంబయ్య తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం అప్పు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నాడు. ఇదే సమయంలో రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటిని ఎలాగైనా కూల్చివేస్తారని ఇరుగు పొరుగువారు మాట్లాడుకుంటుండటంతో వేదనకు గురయ్యాడు.
ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు తీర్చక ముందే ఇంటిని కూల్చివేస్తారనే భయం వెంటాడటంతో మనస్తాపానికి గురైన సాంబయ్య సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని వరంగల్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు.