సిరిసిల్ల రూరల్, మే 2: ముఖ్యమంత్రి కేసీఆర్ను తిడుతున్నారని ఆగ్రహించిన ఓ రైతన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెంప ఛెల్లుమనిపించాడు. ‘మా కేసీఆర్ను ఎందుకు తిడుతున్నావ్?’ అంటూ దాడి చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో రైతులను పరామర్శిస్తానని సోమవారం అనుచరులు, బౌన్సర్లతో కలిసి కేఏ పాల్ బయలు దేరారు. ఆయనను సిద్దిపేట జిల్లా జక్కాపూర్లో పోలీసులు, రైతులు అడ్డుకొన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు చెప్పినా వినకుండా కేఏ పాల్ చిందులు వేశారు. ‘ఆర్డర్లు ఉన్నాయా? ఎందుకు అడ్డుకొంటున్నారు? నిజంగా మీరు పోలీసులా? మీ అందర్నీ సస్పెండ్ చేయిస్తా’ అని ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీస్తూ హంగామా చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన యువ రైతు అబ్బాడి అనిల్ రెడ్డి.. కేఏ పాల్ను చెంప దెబ్బ కొట్టారు. ఆ యువ రైతుపై కేఏ పాల్ బౌన్సర్లు విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడున్న రైతులంతా ‘గో బ్యాక్ పాల్’ అని నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని కేఏ పాల్ను తిప్పి పంపారు.
ఈ సందర్భంగా రైతు అనిల్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టారు. స్వరాష్ట్రంలో రైతుల కోసం ఎంతో చేస్తున్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ ప్రాంతం కాని వ్యక్తి, ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై బురద జల్లుతామంటే చూస్తూ ఊకుంటామా? ప్రభుత్వం, పోలీసులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా? ఇక్కడి రైతులను ఆదుకోవడం మా కేసీఆర్, కేటీఆర్కు తెలుసు’ అని పేర్కొన్నాడు.