ముషీరాబాద్, జనవరి 23: రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు వెల్లడించారు. హైదరాబాద్ విద్యానగర్లోని మార్క్స్ భవన్లో సోమవారం జరిగిన ఎస్కేఎం సమావేశంలో రాష్ట్ర నాయకులు తీగల సాగర్, పశ్య పద్మ, వేములపల్లి వెంకట్రామయ్య, జక్కుల వెంకటయ్య, ప్రసాదన్న మాట్లాడారు. విద్యుత్తు సవరణ బిల్లు ఉపసంహరణలో, కనీస మద్దతు ధరల చట్టం అమలులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రైతు రుణమాఫీ అమలు చేయాలని కోరారు.
లఖీంపూర్ ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించకుండా కేంద్రం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.