హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఈడీ విచారణకు హాజరవుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. మహిళను టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోపించారు. కవితను విచారణ చేస్తున్నది ఈడీ కాదని మోదీ అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈడీ కార్యాలయంలో కవిత కూర్చున్న ప్రదేశం వెనుక మోదీ ఫొటో ఉండటాన్ని పలువురు ప్రశ్నించారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అత్యున్నత కార్యాలయంలో మోదీ ఫొటో దేనికి సంకేతమంటూ నిలదీశారు. కవిత తన ఫోన్లను మాయం చేశారంటూ వచ్చిన ఆరోపణలకు జవాబుగా.. ఆమె తన ఫోన్లను ఒక కవర్లో పెట్టి అందరికీ చూపిస్తూ ఈడీ కార్యాలయం వెళుతున్న ఫోటో వైరల్ అయ్యింది.
తన ఫోన్లను కవిత ధ్వంసం చేశారని గతంలో ఈడీ, సీబీఐ చేసిన ఆరోపణలకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దీంతో గతంలో తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ, కాంగ్రెస్, ఇతరులపై కవిత అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కవితక్క ఫోన్లు ధ్వంసం చేసిందన్నోళ్లను, ఆ వార్త రాసినోళ్లను ఏ చెప్పుతో కొట్టాలి ఇప్పుడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తప్పుడు ప్రచారాలతో తనపై నిందలు మోపుతూ, మోదీకి చెంచాగిరి చేస్తున్న ఈడీ బాగోతాన్ని ఇట్లా సాక్ష్యంగా బయటపెట్టారు కవిత’ అంటూ స్పందించారు. ఫోన్లు ధ్వంసం చేశారని మాట్లాడిన నాయకులు ఇప్పుడు క్షమాపణ కూడా చెప్పాలి.. అని డిమాండ్ చేశారు. ఫోన్లు పగటకొట్టింది అన్నోడి దవడ పగలకొట్టే విధంగా, తాను వాడిన ఫోన్లన్నింటిని ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లిన కవిత.. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు నోర్లు మూయాలి’ అంటూ మండిపడ్డారు. కవితకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ఆమె అభిమానులు ఇలా పోస్టులు పెట్టారు.