బీఆర్ఎస్ బీఫాం అందుకున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. అభ్యర్థుల సభలు, సమావేశాలకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫాం అందుకుతన్న గువ్వల బాలరాజు తొలిసారిగా అచ్చంపేటకు రాగా, పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికారు. అన్ని మండలాల నుంచి దాదాపు 10వేల వరకు బైక్లతో ర్యాలీలో అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలంలో పర్యటించారు. అక్కడ కనిపించిన ఓ వృద్ధురాలితో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నీతి, నిజాయితీలకే పట్టం కట్టి దొంగల భరతం పట్టాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చేనెల 6న సీఎం కేసీఆర్ నారాయణపేటకు రానున్న సందర్భంగా జిల్లా అభివృద్ధి కోసం అద్భుతమైన ప్రకటన చేస్తారని చెప్పారు.
– అచ్చంపేట/నారాయణపేట