కామారెడ్డి రూరల్, జూలై 12 : విద్యుదాఘాతానికి ఓ కుటుంబం బలైంది. ఈ విషాదకర ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించగా సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణ పరిధిలోని బీడీ వర్కర్స్ కాలనీలో నివాసం ఉంటున్న హైమద్ (35), పర్వీన్ (30) దంపతులు. వీరికి కూతురు మహీమ్(6), కొడుకులు అద్నాన్(4), ఫైజన్ ఉ న్నారు. హైమద్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాడు.
వర్షాల కారణంగా పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో హైమద్ తన కుటుంబంతో కలిసి పక్క వీధిలో ఉండే అత్తగారింటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం భార్య, కూతురు మహీమ్, కొడుకు అద్నాన్తో ఇంటికి చేరుకొన్నారు. మరో కుమారుడు ఫైజన్ అక్కడే ఉండిపోయాడు. దుస్తులు ఆరేసేందుకు ఇంట్లో కట్టిన జీఏ వైరు ఒకవైపు తెగిపోయి విద్యుత్ మీటర్ వద్ద ఉండే ఫీజుపై పడింది. దీంతో జీఏ వైరుతోపాటు దానిపై ఆరేసిన దుస్తులు తడిగా ఉండటంతో విద్యుత్తు సరఫరా అయ్యింది.
కూతురు మహీమ్ ఆడుకొంటూ దుస్తుల వద్దకు వెళ్లగా షాక్ తగలడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. గమనించిన పర్వీన్ కూతురిని రక్షించే క్రమంలో తనకు కూడా షాక్ తగిలి కుప్పకూలింది. వారిని రక్షించేందుకు వచ్చిన హైమద్ సైతం కరెంట్ షాక్కు గురయ్యాడు. ఏం జరుగుతుందో తెలియక తండ్రి వద్దకు వెళ్లిన కొడుకు అద్నాన్ సైతం విద్యుదాఘాతానికి బలయ్యాడు. గమనించిన స్థానికులు విద్యుత్తు అధికారులకు సమాచారం ఇవ్వడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించినట్టు డీఎస్పీ సోమనాథం తెలిపారు. ఘటనా స్థలాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా విప్ గంప గోవర్ధన్ రూ.25 వేలు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి మృతులు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు ఆయన పేర్కొన్నారు.