సంగారెడ్డి : ఇది హృదయ విదారక ఘటన.. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏర్పడిన కలహాలు.. విషాదాన్ని మిగిల్చాయి. భర్త ఇంట్లో ఉరేసుకోగా, భార్య తన ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్, లావణ్య దంపతులు.. బీహెచ్ఈఎల్లో స్థిరపడ్డారు. వీరికి ప్రథమ్(8), సర్వజ్ఞ(3) అనే ఇద్దరు పిల్లలున్నారు. అయితే చంద్రకాంత్ గత కొంతకాలం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో ఆశించినంత లాభాలు రాలేదు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో భార్యాభర్తల మధ్య కొద్ది కాలం నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి లావణ్య, చంద్రకాంత్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో లావణ్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఇంటి నుంచి భార్యాపిల్లలు వెళ్లిపోవడంతో చంద్రకాంత్ తీవ్ర ఆవేదనకు లోనై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన భర్త ఏం చేస్తున్నాడని లావణ్య.. పక్కింటి వారికి ఫోన్ చేసి అడిగింది. దీంతో వారు ఆ ఇంటిని గమనించగా, చంద్రకాంత్ ఉరేసుకున్న ఆనవాళ్లు కనిపించాయి. చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు లావణ్యకు పక్కింటి వారు ఫోన్లో చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లావణ్య కూడా తన ఇద్దరు పిల్లలను ఆందోళ్ పెద్ద చెరువులో తోసేసి, తాను ఆత్మహత్య చేసుకుంది.
ఆందోళ్ పెద్ద చెరువులో శుక్రవారం ఉదయం రెండు మృతదేహాలను స్థానికుగు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు.. నీటిపై తేలియాడుతున్న తల్లీకుమారుడి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం వారి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. మూడేండ్ల పాప కూడా తల్లితోనే ఉందని బంధువులు చెప్పడంతో.. చెరువును గజ ఈతగాళ్లు గాలించారు. పాప మృతదేహాన్ని కూడా వెలికితీశారు. అనంతరం ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.