కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగి సర్వీస్లో ఉండి మరణిస్తే ఆ కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షనర్ల మెడికల్ అలవెన్స్ను రూ.350 నుంచి 600లకు పెంచింది.
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని మూడు క్యాటగిరీలుగా చేసి, వారికి 30% వేతనాలు పెంచింది. మొదటి క్యాటగిరీకి రూ.15,600, రెండో క్యాటగిరీ వారికి రూ.19,500, మూడో క్యాటగిరీ కింద రూ.22,750 ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు 30 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు ఉద్యోగుల వేతనాల పెంపుతోపాటు సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ అమలు తదితర నిర్ణయాలతో వరుసగా 10 పీఆర్సీ జీవోలు విడుదల చేసింది. పీఆర్సీ ఉత్తర్వులు జూలై 2018 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. మానిటరీ బెనిఫిట్ 2020 ఏప్రిల్ నుంచి వర్తింపచేస్తారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు చెల్లించాల్సిన బకాయిలను పదవీవిరమణ సమయంలో చెల్లిస్తారు. ఒకవేళ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండు నెలల బకాయిలను ఈ సంవత్సరంలోనే చెల్లిస్తారు. పెం చిన వేతనాలను ఈ జూన్నుంచే అమలుచేస్తారు. పెంచిన వేతనాలను స్థానిక సంస్థ లు, ప్రభుత్వ సహాయక సంస్థలు కూడా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం తన తొలి పీఆర్సీలో కనీస మూల వేతనాన్ని రూ.19 వేలుగా నిర్ణయించింది. 2014లో రూ.13 వేలుగా ఉన్న కనీస మూల వేతనాన్ని రూ.19 వేలకు పెంచింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల్లో మొత్తం 32 క్యాటగిరీల ఉద్యోగులు, అధికారులు ఉన్నట్టుగా ఉత్తర్వులో పేర్కొన్నది. 32వ క్యాటగిరీకి చెందిన అధికారులకు 2014లో కనీస మూల వేతనం రూ.87,130 ఉండగా కొత్త పీఆర్సీలో రూ.1,27,310కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.28 శాతంగా డీఏ నిర్ణయించింది.
హెచ్ఆర్ఏను గరిష్ఠంగా 24 శాతం, కనిష్ఠంగా 11 శాతంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 50 లక్షల జనాభా పైబడి ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఉద్యోగులు, అధికారులకు మూలవేతనంపై 24%, రెండు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్లో పనిచేసే ఉద్యోగులకు మూల వేతనంలో 17%, 50 వేల నుంచి రెండు లక్షల మధ్య జనాభా ఉన్న ఆదిలాబాద్, కాగజ్నగర్, నిర్మల్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిద్దిపేట, జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, తాండూరు, వనపర్తి, గద్వాల, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, జనగామ, కొత్తగూడెం, పాల్వంచ, జాలపల్లి, బడేపల్లి, నస్పూర్, షాద్నగర్తో పాటు 50 వేలకు తక్కువ జనాభా ఉన్న జిల్లాకేంద్రాలైన ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నారాయణపేట, మెదక్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నాగర్కర్నూల్, శామీర్పేట, శంషాబాద్లో పనిచేసే ఉద్యోగులకు 13%, ఇతర అన్ని ప్రాంతాలవారికి 11% హెచ్ఆర్ఏ నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ రూ.24,280 పే స్కేల్ ఉన్నవారికి జీహెచ్ఎంసీలో రూ.600, ఇతర కార్పొరేషన్లలో రూ.300, రూ.24,280 నుంచి రూ. 42,300 పే స్కేల్ ఉన్న వారికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ.850, ఇతర కార్పొరేషన్లలో రూ.450, రూ.42,300 నుంచి రూ.54,220 వరకు ఉన్న వారికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ.950, ఇతర కార్పొరేషన్లలో రూ.550, రూ.54,220పైన పేస్కేల్ ఉన్నవారికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ.1250, ఇతర కార్పొరేషన్లలో రూ.700 గా నిర్ణయించింది.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీని ప్రస్తుతం రూ.12లక్షలు చెల్లిస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.16లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 75 ఏండ్ల నుంచి 70 ఏండ్లకు కుదించింది. ఇందులో 70 నుంచి 75 ఏండ్ల వరకు 15%, 75 నుంచి 80 ఏండ్ల వరకు 20%, 80 నుంచి 85 ఏండ్ల వరకు 30%, 85 నుంచి 90 ఏండ్ల వరకు 40%, 90 నుంచి 95 వరకు 50%, 95 నుంచి 100 ఏండ్ల వరకు 60%, వందేండ్ల పైబడిన వారికి 100% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
పదవీ విరమణచేసిన ఉద్యోగులకు కనీస పింఛన్ రూ.6500 నుంచి రూ.9,500కు పెంచారు. 2018 తర్వాత ఉద్యోగ విరమణ చేసినవారందరికీ కొత్త పీఆర్సీ ప్రకారమే పెన్షన్లు చెల్లిస్తారు. వారికి బకాయిలను 36 నెలల వ్యవధిలో చెల్లిస్తారు.
ప్రభుత్వం పీఆర్సీ ఉత్తర్వులను విడుదల చేయడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు సంబంధించి అన్ని ఉత్తర్వులను ఒకేసారి విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంతునాయక్ కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ కల్పిస్తూ జీవో 58 విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్కు సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ధన్యవాదాలు తెలిపారు. సీపీఎస్ కుటుంబాలకు సీఎం కేసీఆర్ చిరస్మరణీయుడని సంఘం ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్గౌడ్ పేర్కొన్నారు. జీవోల విడుదల పట్ల సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మహమూద్అలీ తదితరులకు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం హుస్సేనీ, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్, వీఆర్ఏల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, ప్రధాన కార్యదర్శి రఫీ కృతజ్ఞతలు తెలిపారు.