హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ)/చర్లపల్లి, ఏప్రిల్ 16: హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడ సాయినగర్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయ్యారు. ఓ టింబర్ డిపోలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నరేశ్ (35), అతని భార్య సుమ (35), వారి కుమారుడు జశ్విత్ (6) ఈ ప్రమాదంలో మృతిచెందారు. నగేశ్ స్థానికంగా హెచ్పీ గ్యాస్ డెలివరీ బాయ్గా, డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబం నివాసముండే అపార్ట్మెంట్ పక్కనే ఉన్న టింబర్ డిపోలో మంటలు చెలరేగి ఒక్కసారిగా అపార్ట్మెంట్ను చుట్టుముట్టాయి.
ఆ వెంటనే రెండో అంతస్థులో ఉండే నరేశ్ ఇంటిలోకి మంటలు చేరాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి కిందికి దిగే ప్రయత్నంలో మెట్లపైనే ముగ్గురూ మంటల్లో దహనమవుతూ ప్రాణాలొదిలారు. శనివారం సాయంత్రమే నరేశ్ పెద్ద కుమారుడు హాత్విక్ సమీపంలోని మేనత్త ఇంటికి వెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన నారాయణ (55), అతడి భార్య ఉమాదేవి (48), వాచ్మెన్ వీరమల్లేశ్ (50), పద్మ (40)ను వెంటనే స్థానికులు దవాఖానకు తరలించారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకొన్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
మృతుల కుటుంబానికి ఆర్థికసాయం
మృతుల కుటుంబానికి రూ.45 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్టు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనలో మృతిచెందిన కుటుంబానికి జాతీయ విపత్తుల విభాగం నుంచి మృతులు ఒక్కొక్కరికి నాలుగు లక్షల చొప్పున, జీహెచ్ఎంసీ తరఫున మొత్తంగా రూ.6 లక్షలు, రెవెన్యూ అధికారుల తరఫున రూ.1.50 లక్షలు, టింబర్ డిపో యజమాని తరఫున రూ.25 లక్షలు అందించనున్నట్టు తెలిపారు. దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం మరో రూ.25 వేలను టింబర్ డిపో యజమాని చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సొంతంగా రూ.50 వేలు, మున్నూరుకాపు సంఘం ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి గంధం నాగేశ్వర్రావు రూ.50 వేలను, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి రూ.20 వేలను మృతుల కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.