రఘునాథపాలెం, జనవరి 14: ఉద్యోగ, ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన ఐదుతరాల వారు సంక్రాంతి పండుగ పూట ఒక్కచోట చేరి సందడి చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వీ వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పోలీస్ పటేల్ రామయ్య, బాపమ్మ దంపతులు. వారి ఇద్దరు కుమారులు, కోడళ్లు, ఏడుగురు కుమార్తెలు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు, మునిమనుమలు, మునిమనుమరాళ్లు ఇలా ఐదుతరాలు కలిపితే 140 మంది వరకు ఉంటారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కొందరు విదేశాల్లో ఉన్నారు. రామయ్య, బాపమ్మ దంపతులు ప్రస్తుతం లేకపోయిన వారి తరువాతి తరాలకు చెందిన వారం తా ఏటా సంక్రాంతి పర్వదినాన ఒక్కచోట చేరి నేటి తరానికి బంధుత్వాలు, ఆప్యాయతలు, అనుబంధాల విలువలను తెలియజేస్తున్నారు. గత ఐదేండ్లుగా వీరు సంక్రాంతి రోజు ఇలా ఒక్కచోట చేరుతున్నారు. ఈ సారి కూడా 140 మంది కలుసుకొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకను జరుపుకొన్నారు.