మన్సూరాబాద్, జూన్ 5: కేఏ పాల్ ప్రలోభాలకు అమరుల కుటుంబాలు లొంగిపోవని, సీఎం కేసీఆర్తోనే అమరుల కుటుంబాలకు న్యాయం జరుగుతున్నదని కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు. రాజ్యసభ సీటు ఇస్తానని మభ్యపెట్టి తన భర్త కాసోజు వెంకటాచారిని ప్రజాశాంతి పార్టీలో కేఏ పాల్ చేర్చుకొన్నారని మండిపడ్డారు. నగరంలోని ఎల్బీనగర్లో శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఆదివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేఏ పాల్ తమ కుటుంబంలో చిచ్చుపెట్టడమే కాకుండా భార్యాభర్తలను విడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాజ్యసభ సీటుతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. తమ వెంట రావాలని కేఏ పాల్ కోరారని వెల్లడించారు.
ఈ నెల 1న భద్ర అనే వ్యక్తి తమ ఇంటికొచ్చి రూ. 20 లక్షల ప్యాకేజీ మాట్లాడి నా భర్త వెంకటాచారిని తీసుకెళ్లాడని తెలిపారు. కేఏ పాల్ నంబరు వన్ కేడీ అని ధ్వజమెత్తారు. అమరుల కుటుంబాలకు సహాయం చేస్తానని చెబుతున్న కేఏ పాల్ 2014 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. కేఎ పాల్ తన స్వార్థ రాజకీయాల కోసం శ్రీకాంతాచారి పేరును వాడుకోవాలని చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ సుమారు 500 కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున సాయం చేశారని, మరో 500 మందికి తప్పక న్యాయం చేస్తారన్నారు. తన భర్త ఆరోగ్యం బాగాలేదని వెంటనే ఆయనను కేఏ పాల్ వదిలిపెట్టాలని కోరారు. తన ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్లోనే ఉంటానని శంకరమ్మ తెలిపారు. కార్యక్రమంలో శంకరమ్మ బంధువులు లలిత, వీరాచారి పాల్గొన్నారు.