కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ కలెక్టరేట్: రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అమరవీరుల కుటుంబాల నుంచి చేదు అనుభవం ఎదురైంది. అమరుల కుటుంబాలను సన్మానించేందుకు మంత్రి వేదిక దిగి వారివద్దకు వెళ్లారు. సదరు కుటుంబాల వారు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మ్యానిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీనైనా మీ ప్రభుత్వం నేరవేర్చిందా?’ అని ప్రశ్నించిన తీరు కలకలం రేపింది. ‘ఏడాదికోసారి పిలుసుడు.. శాలువా కప్పి, దండేసి పంపుడు. రాష్ట్రం కోసం చనిపోయిన మా పిల్లల పేరు మీద మాకు సన్మానం చేస్తున్నారో.. లేక అవమానపరుస్తున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికల ముందు ఏమేమి మాట్లాడిన్రు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏమేం అంశాలు పెట్టిన్రు. మాకిచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తరు? మా పిల్లల త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది. వారి పేర్లపై అధికారం అనుభవిస్తున్నరు. చెట్టంత కొడుకులను పోగొట్టుకుని మేము క్షోభ పడుతున్నం. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా?’ అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
ఊహించని విధంగా ఒక్కసారిగా ఎదురైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన మంత్రి అడ్లూరి.. సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెబుతూనే, పక్కనే ఉన్న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో ‘మీ నియోజకవర్గం వాళ్లే కదా? ఏమైనా ఉంటే వారికి చూడు’ అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లారు. ‘మ్యానిఫెస్టోలో పెట్టిన గౌరవ భృతి ఏదీ? 250 గజాల జాగ ఏదీ’ అంటూ ఊపిరి సలుపనివ్వకుండా ప్రశ్నించడంతో మంత్రి అడ్లూరి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. వారి ప్రశ్నలు ప్రభుత్వానికి అసౌకర్యంగా మారినా, ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆలోచింపజేసింది.