హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత సీహెచ్ ఉపేంద్ర విమర్శించారు. కాంగ్రెస్ నాయకులతోపాటు ఆ పార్టీ సోషల్ మీడియాలో సైతం కేటీఆర్పై తప్పుడు ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
నిరాధారమైన, సత్యదూరమైన వార్తలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో కేటీఆర్కున్న అభిమానాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో విచారణ జరుపడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని, అలాంటి ఘటనలకు బీఆర్ఎస్ వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టంచేశారని గుర్తుచేశారు.