మోర్తాడ్/బాల్కొండ : సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. చెక్ డ్యాముల నిర్మాణంతో రైతులకు మేలు జరుగుతుంటే కొందరు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మోతె కప్పల వాగు పై రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించే హై లెవల్ బ్రిడ్జ్, మోర్తాడ్ తక్కురివాడ పాయింట్ వద్ద పెద్దవాగు పై 9.5 కోట్ల వ్యయంతో నిర్మించే చెక్ డ్యామ్, వడ్యాట్ గ్రామంలో మోర్తాడ్ ౼ వడ్యాట్ ఆర్ అండ్ బీ రోడ్ రూ.1.5 కోట్లతో పునరుద్ధరణ పనులకు, కమ్మర్పల్లి వద్ద వడ్యాట్ ౼ కమ్మర్పల్లి రోడ్ (పి.ఆర్) రూ.87 లక్షలతో రోడ్డు పునరుద్ధరణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..చెక్ డ్యాముల వల్ల ఎండాకాలంలో కూడా రైతుల బోర్లలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. బాల్కొండ అభివృద్ధి పై విమర్శించేవారంతా రాజకీయంగా అడ్రస్ లేనివారేనని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గ ప్రజలు,రైతులు అన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో వారే సమాధానం చెప్తారన్నారు.
ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని చిల్లర, కుట్ర రాజకీయాలు చేసిన బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ఆగదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
ఇక ఉద్యోగాల కోసం మిలియన్ మార్చ్ చేస్తానన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ మిలియన్ మార్చ్ ముందు మోదీ దగ్గర చేసి తెలంగాణలో చేయాలన్నారు.
ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బిజెపి ఉద్యోగకల్పన పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షా 32వేల ఉద్యోగాలు ఇచ్చామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చినట్లు నిరూపిస్తావా అని బండి సంజయ్ కు సవాల్ విసిరారు.
నిజామాబాద్ ఎంపి అర్వింద్ పసుపుబోర్డు పేరుతో రైతులను మోసం చేసాడని,మద్దతు ధర ఇప్పిస్తానని మూడేళ్ళుగా తప్పించుకు తిరుగుతున్నాడని అందుకే రైతులు తిరగబడుతున్నారని అన్నారు. ఇక నుంచి నోటికొచ్చినట్లు మాట్లాడితే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊర్కోరని మంత్రి హెచ్చరించారు.