యాదాద్రి భువనగిరి/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్ద రైలులోని ఎస్4 బోగీలో మంటలు చెలరేగాయి. ఉదయం 10:09 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఏడు బోగీలు దగ్ధమయ్యాయి. ప్రయాణికులు, లోకోపైలట్ అప్రమత్తతతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. బోగీల్లో పొగలు, మంటలు వ్యాపించటంతో ఓ ప్రయాణికుడు చైన్ లాగి రైలును ఆపాడు. వెంటనే ప్రయాణికులు భయంతో బయటికి పరుగులు తీశారు. ప్రమాదంలో ప్రయాణికుల సామగ్రి, వస్తువులు కాలిపోయాయి. ఒడిశాకు చెందిన యువతి వినీత బీటెక్ సర్టిఫికెట్లు బూడిదయ్యాయి. మంటలు ఇతర బోగీల్లోకి వ్యాపించకుండా రైల్వే సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. మంటలు వ్యాపించిన బోగీలను రైలు నుంచి వేరు చేశారు. కాగా, మంటలతో రైల్వే విద్యుత్తు లైన్ దెబ్బతిన్నది. సికింద్రాబాద్ నుంచి డీజిల్ ఇంజిన్ తెప్పించి మిగతా బోగీల్లో ప్రయాణికులను సికింద్రాబాద్ తరలించారు. కొందరు బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న జీఎం పరిస్థితులను సమీక్షించారు.
సిగరెట్ వల్లా? షార్ట్ సర్క్యూటా?
ప్రమాద ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఓ వ్యక్తి రైల్లో సిగరెట్ తాగి, చార్జింగ్ పాయింట్ వద్ద పడేశాడని దాంతో మంటలు చెలరేగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆ మార్గంలో నడవాల్సిన రెండు రైళ్లను రద్దు చేశామని వివరించారు. బోగీలను తొలగించి, మార్గాన్ని క్లియర్ చేశామని చెప్పారు.
ప్రయాణికులంతా క్షేమం: డీజీపీ
రైలు ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, అందరినీ క్షేమంగా వారి స్వస్థలాలకు బస్సులో తరలించామని డీజీపీ అంజనీకుమార్ శుక్రవారం ట్వీట్ చేశారు.‘భువనగిరి రూరల్ పీఎస్ పరిధిలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగటంతో ప్రయాణికులను సురక్షితంగా బస్సుల్లో తరలించారు. పోలీసులు, అగ్నిమాపక, రైల్వే శాఖలు సమన్వయంతో పనిచేశాయి. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. 18 కోచ్లలో 11 కోచ్లను వేరు చేసి సురక్షితంగా తీసుకెళ్లారు’ అని పేర్కొన్నారు.
మోదీ అసమర్థపాలనకు నిదర్శనం: గుత్తా
నందికొండ, జూలై 7: దేశంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలోని తమ నివాసంలో శుక్రవారం ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని, 300 మంది ప్రాణాలను కేంద్రం పొట్టన పెట్టుకున్నదని మండిపడ్డారు. అది మరువకముందే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదం జరగటం దురదృష్టకరమని, కేంద్రం నిర్లక్ష్యం వల్లే వరుస ప్రమాదా లు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.