Aarogyasri | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశ్రీ పథకంపై గ్రామాల్లో దుష్ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రప్రభుత్వం త్వరలో ఈ పథకాన్ని నిలిపివేస్తుందని కొందరు వదంతులు సృష్టిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకమే అమల్లో ఉంటుందని, ఆ కార్డు ఉన్నవారికే చికిత్స అందుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ దరఖాస్తుకు ఈ నెల 31వ తేదీ ఆఖరి గడువంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పంపుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
ఆయుష్మాన్ భారత్లో పేరు నమోదుకు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా నిర్వాహకులు ఒక్కో పేరు నమోదుకు రూ.30 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తూ దండుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు సొంతూళ్లకు వెళ్లి మరీ హడావిడిగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎప్పటికీ ఆగిపోదని అధికారులు భరోసా ఇస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, కొత్తగా ఆయుష్మాన్ భారత్ కార్డులు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రజలు అనవసరంగా హైరానా పడి డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని కోరుతున్నారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం వందరెట్లు మెరుగైనది. రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. 90 శాతం జనాభాకు కవరేజీ ఉన్నదన్నమాట. ఆయుష్మాన్ భారత్ కేవలం 26 లక్షల కుటుంబాలకే పరిమితమైంది. అంటే ప్రతి 10 మందిలో ముగ్గురికే ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మొదట ఆయుష్మాన్ భారత్లో చేరలేదు. 2021 మే 18న దాని అమలుకు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నది. రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రత్యేకంగా అమలు చేయడం లేదు. ఇది ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగానే అమలవుతున్నది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయి.
ప్రచారం: ఆరోగ్యశ్రీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేస్తుంది.
వాస్తవం: ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగే ప్రసక్తే లేదు.
ప్రచారం: ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటేనే చికిత్స అందుతుంది.
వాస్తవం: రాష్ట్రంలో ఆ కార్డు ఎందుకూ పనికిరాదు. ఉచిత వైద్యానికి రేషన్ కార్డు ఉంటే చాలు. ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా సేవలు అందుతాయి.
ప్రచారం: ఈ నెల 31వ తేదీలోగా ఆయుష్మాన్ భారత్కు దరఖాస్తు చేసుకోవాలి.
వాస్తవం: నిజానికి ఆయుష్మాన్ కార్డు అవసరం లేదు. ఒకవేళ దరఖాస్తు చేసుకోవాలనుకున్నా.. దానికి చివరి తేదీ అంటూ ఏదీ లేదు.
ప్రచారం: ఆయుష్మాన్ భారత్కు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వాస్తవం: సొంత ఇల్లు ఉంటే ఆయుష్మాన్ భారత్కు అనర్హులు. కేంద్ర ప్రభుత్వ అడ్డగోలు నిబంధనల వల్ల రాష్ట్రంలో కేవలం 26 లక్షల కుటుంబాలకే ఇది వర్తిస్తుంది.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకంపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక బీజేపీ హస్తమున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పటిష్ఠంగా అమలవుతున్నది. ఎంత ప్రయత్నించినా బీజేపీకి ఆదరణ దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి ఒక గుర్తింపు కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం పొందాలని చూస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్యశ్రీ ఎంతో మెరుగైన పథకమే అయినా.. రాష్ట్ర బీజేపీ నేతలు, కిషన్ రెడ్డి, నిర్మలా సీతారామన్ వంటి కేంద్ర మంత్రులు ఆయుష్మాన్ భారత్ అద్భుతమంటూ పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్నా.. ఆ విషయాన్ని దాచి నిందలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న గందరగోళం వెనుక బీజేపీ హస్తం ఉండొచ్చని, వారి మాయలో పడొద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు.