హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ బోర్డు పేరుతో నకిలీ వెబ్సైట్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. వీటితో అసలైన బోర్డు వెబ్సైట్కు ఇబ్బందులున్నాయని, వెంటనే వాటిని తొలగించాలని బోర్డు అధికారులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్చి, ఏప్రిల్లో టెన్త్ పరీక్షలకుఎస్సెస్సీ బోర్డు సన్నాహాలు చేస్తున్నది. విద్యార్థుల డాటాను www.bse.telangana .gov.in ద్వారా సేకరిస్తున్నది. ఈ వెబ్సైట్ను జిల్లా విద్యాధికారులు, సెకండరీ స్కూల్స్ హెడ్స్ ఆపరేట్ చేసే వీలు ఉన్నది.
బోర్డుకు సంబంధించిన కంప్యూటర్ వర్క్ సికింద్రాబాద్లోని మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో బోర్డు అసలైన వెబ్సైట్లను పోలినట్టు రెండు (bsetelangana. co.in, bsetelanganagov.in) నకిలీ వెబ్సైట్లను గుర్తించిన సంస్థ ఈ విషయాన్ని బోర్డు అధికారులకు తెలిపింది. నకిలీ వెబ్సైట్లను తొలగించి, నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ అఫ్ ఎగ్జామినేషన్ విభాగం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్రావు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ వెబ్సైట్ల సృష్టి వెనుక ఇంటర్మీడియట్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల పాత్ర ఉన్నదా? అనే అనుమానాలు సైబర్క్రైమ్ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.