సూర్యాపేట : నకిలీ విత్తనాలను తయారు చేసి అమ్ముతూ అమాయక రైతుల్ని మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను కోదాడ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 13.5 కోట్ల విలువైన కల్తీ విత్తనాలను ఈ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ ఈ రాకెట్కు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు.
హైదరాబాద్లోని వనస్దలిపురం కేంద్రంగా మూలపాటి శివారెడ్డి అనే వ్యక్తి ద్వారాకా సీడ్స్ పేరుతో గత కొంత కాలంగా కంపెనీ నిర్వహిస్తున్నడు. ఇతను గతంలో కర్ణాటక, తమిళనాడు మద్యప్రదేశ్, ఇండోర్ ప్రాంతాల్లో పలు సీడ్స్ కంపెనీల్లో పని చేశాడు. ఆ అనుభవంతో ఇక్కడ కూడా ద్వారాకా సీడ్స్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసుకోని కాలం చెల్లిన, లేబుల్స్ లేకుండా, లాట్ నెంబర్ లేకుండా, లెసెన్స్ లేని డీలర్లతో నాణ్యత ప్రమాణాల ద్రువీకరణ పత్రాలు లేకుండా హైబ్రీడ్ అంటూ మిర్చి, టమాట, బెండ, దొండ , పుచ్చకాయ లాంటి 15 రకాల నకిలి విత్తనాల్ని మార్కెట్ లో అమాయక రైతులకు అంటగడుతున్నారు.
బుధవారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో వీటిని గుర్తించిన పోలీసులు లోతుగా విచారణ చేసి ఈ రాకెట్ ను ఛేధించారు. శివారెడ్డి మహబూబాబాద్, సుజాతానగర్, వత్సవాయి, వైరా ప్రాంతాల్లో కంపెనీలు ఏర్పాటు చేసి డీలర్లను నియమించుకోని ఈ దందా నడిపిస్తున్నాడు. ఈ దందాలో శివారెడ్డికి సహకరిస్తున్న ద్వారకా సీడ్స్ అకౌంటెంట్ యాదగిరి, రీజనల్ మేనెజర్ లక్ష్మా రెడ్డిలతో పాటు శివారెడ్డి నియమించుకున్న డీలర్లు ప్రతాప్ కుమార్, జగన్మోహన్ రావు, రమణలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 986 కిలోల నకిలి విత్తనాలు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ పదమూడున్నర కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నకీలి విత్తనాల్ని అన్నింటిని వనస్దలిపురంలోని ఓ ఇంట్లో ప్యాక్ చేసి వివిధ ప్రాంతాలకు మధ్యవర్తుల ద్వారా సరఫరా చేసి శివారెడ్డి ఈ నకిలీ విత్తన దందా చేస్తునట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో ఎలాంటి నకిలీ విత్తనాలు అమ్మినట్లు కఠిన చర్యలు తప్పవని, పీడీ యాక్టు పెట్టి జైల్లో వేస్తామని హెచ్చరించారు.