అమీన్పూర్, మార్చి 29 : సీసీఎల్ఏ అధికారినని, సీఎం పేషీ నుంచి వచ్చానంటూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రాంతంలో వారం రోజులపాటు హల్చల్ చేసిన నకిలీ అధికారి సాయి అనిరుధ్ను అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనిరుధ్ అనే వ్యక్తి వారం రోజులుగా అమీన్పూర్ ప్రాంతంలో అనేక మంది అధికారులు, బిల్డర్లను, అధికారులకు నిద్రపోకుండా చేశాడు. రెవెన్యూ పరమైన అంశాలపై అతనికి ఉన్న అవగాహనతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారుల వద్ద హల్చల్ చేశాడు. తాను సీఎం రేవంత్రెడ్డి పేషీ ప్రత్యేకాధికారిని అని, అక్కడి నుంచి వచ్చానంటూ భూరికార్డులు అందజేయాలని రెవెన్యూ అధికారులకు హుకుం జారీచేశాడు. అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎఫ్టీఎల్, బఫర్ భూములు, నాలాలకు సంబంధించి పూర్తి అవగాహనతో సీనియర్ అధికారిలా ప్రశ్నలు వేయడంతో స్థానిక అధికారులు బెంబేలెత్తిపోయారు.
పూర్తి రికార్డులు అతనికి ఇవ్వడంతోపాటు అనిరుధ్ వెంట క్షేత్రస్థాయిలో సర్వేకు సైతం అధికారులు వెళ్లారు. అమీన్పూర్ మండలం పటేల్గూడ పంచాయతీలో స్థానిక అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా అక్రమ నిర్మాణాలంటూ జేసీబీ వెంట తీసుకెళ్లి అనిరుధ్ రెండు భవనాలు కూల్చివేయించడం విశేషం. దీనిపై అనుమానం వచ్చిన పటేల్గూడ పంచాయతీ కార్యదర్శి రమేశ్ అమీన్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. అమీన్పూర్ పోలీసులు అనిరుధ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నకిలీ అధికారి అని తేలింది. సాయి అనిరుధ్ (30) పటాన్చెరు వాసిగా పోలీసులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ వ్యవహారం ఉమ్మడి మెదక్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.