హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ప్రకటనలిస్తూ రద్దీగా ఉండే దుకాణాలు, చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మంది సభ్యులున్న ఈ ముఠా నుంచి రూ.30,68,500 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో వైద్యునితోపాటు పలువురు విద్యార్థులు ఉన్నట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం మీడియాకు వెల్లడించారు. సైబరాబాద్లోని చెస్ట్ బ్యాంకులకు 2013 నుంచి 3,65,500 నకిలీ నోట్లు రావడంతో రెండున్నర నెలల క్రితం క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఏసీపీ శ్యాంబాబు నేతృత్వంలోని ఈ బృందం తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడు, కర్ణాటకలో ఆరా తీసి ఈ ముఠాను అరెస్ట్ చేసిందని వివరించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న సూర్య (తమిళనాడు), చరణ్సింగ్ (ఏపీ), కస్తూరి రమేశ్బాబు (తెలంగాణ) పరారీలో ఉన్నట్టు తెలిపారు. కరెన్సీ నోట్లలో రిజర్వు బ్యాంకు పలు సెక్యూరిటీ ఫీచర్లను పొందుపర్చిందని, నగదు లావాదేవీల సమయంలో ప్రతి ఒక్కరూ ఆ ఫీచర్లను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా నకిలీ నోట్ల బారిన పడకుండా చూసుకోవాలని సీపీ సూచించారు.