Andhajyothy | హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా పచ్చగా కన్పించినట్టు.. ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న అంధజ్యోతికి అన్నింటిలోనూ తప్పులే కనిపిస్తున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ ‘కక్కుర్తి’ వార్తలను వండి వార్చుతున్నది. తాజాగా మరో అవాస్తవాన్ని కథనంగా అల్లేసింది. మిల్లర్లకు తరుగు చార్జీలు చెల్లించడం లేదంటూ సోమవారం ఓ కట్టుకథను ప్రచురించింది. నిజానిజాలు నిర్ధారించుకోకుండా తోచింది రాసి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. వాస్తవాలను పరిశీలిస్తే పూర్తి అవగాహన రాహిత్యంతో, అక్కసుతో వార్తను అచ్చేసినట్టు అర్థమవుతున్నది.
అంధజ్యోతి ఆరోపణ: కేంద్రం ఇస్తున్న ధాన్యం తరుగు చార్జీలను మిల్లర్లకు ఇవ్వకుండా ప్రభుత్వమే వినియోగించుకుంటుంది. రూ. 568 కోట్లను మిల్లర్లకు ఎగ్గొట్టింది.
వాస్తవం: 1998లో పంజాబ్లో అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా మిల్లింగ్ చేయబోమని రైస్ మిల్లర్లు ఆందోళనకు దిగారు. దేశంలో ధాన్యం కొరత పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ ఒక్క ఏడాది మిల్లర్లకు ఒక శాతం తరుగు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి క్యాబినెట్ అనుమతి కూడా లేదు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ధాన్యం సేకరణ వివరాల్లో ఆ కాంపోనెంట్ చేరింది. దాన్ని మిగిలిన అన్ని రాష్ర్టాలు ఫాలో అయ్యాయి. మరోవైపు, 2017లో ధాన్యం డబ్బుల చెల్లింపులపై కాగ్ ప్రత్యేకంగా పరిశీలనలు జరిపింది. అందులో ఈ తరుగు అంశం వెలుగు చూసింది. అప్పటికే గోకక్ కమిటీ ప్రతిపాదనల మేరకు అవుట్ టర్న్ రేషియాలోనే మిల్లర్లకు 2శాతం తరుగు కలిపి ఇస్తుండగా ఇందుకు అదనంగా మళ్లీ ఒక శాతం తరుగు డబ్బులు ఇవ్వడాన్ని కాగ్ తప్పుపట్టింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఇలా దుర్వినియోగమైన సుమారు వెయ్యి కోట్ల రూపాయలను రికవరీ చేయాలని ఆదేశించింది. కాగ్ నివేదిక నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు 2021-22 సంవత్సరం నుంచి మిల్లర్లకు తరుగు డబ్బులు ఇవ్వడాన్ని ఆపేశారు. కాగ్ ఆదేశాలు వచ్చేంత వరకు మిల్లర్లకు తరగు చార్జీలను చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత నిలిపేసింది. వాస్తవం ఇది కాగా, అంధజ్యోతి అవాస్తవాలతో ఓ కథనం రాసి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేసింది.