హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివార్లలోని ప్రైవేట్ ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొన్ని ముఠాలు కబ్జా చేస్తున్నాయి. అనంతరం అవి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ కబ్జాలకు సంబంధించి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోనే 8 కేసులు నమోదయ్యాయి. దీంతో డాక్యుమెంట్ రైటర్ ఉదయ్రెడ్డితోపాటు జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వర్రావు అలియాస్ జీవీఆర్, బందెల్ల ప్రశాంత్ అలియాస్ బాబి, బందెల్ల ప్రభాకర్, పొన్నబోయిన బాలకృష్ణ అలియాస్ బాలు అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని లోతుగా ప్రశ్నించడంతో కీసర సబ్రిజిస్ట్రార్ రెహమాన్ సాయం చేసినట్టు వెల్లడైంది. ఒక్కో నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు రెహమాన్ రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో రెహమాన్ను ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్టు చేయాల్సిన పోలీసులు ఆ విషయాన్ని పక్కన పెట్టేసినట్టు సమాచారం. రెహమాన్ హయాంలో దాదాపు 100 నకిలీ డాక్యుమెంట్లు రిజిస్టరైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.