గాంధారి, జనవరి 19: కామారెడ్డి జిల్లా(Kamareddy district) గాంధారి మండలం చద్మల్తండాలో నకిలీ 500 రూపాయల నోట్లు (Fake currency)కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చద్మల్తండాలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధికి భక్తులు పెద్ద మొత్తంలో కానుకలు, వివరాలు సమర్పిస్తారు. ఆ డబ్బులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తండాలో అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తారు. కమిటీలోని ఓ బాధ్యుడు ఉత్సవాల అనంతరం వడ్డీకి ఇచ్చి, తిరిగి జాతర సందర్భంగా వాటిని తీసుకుంటాడు.
సుమారు రూ.కోటి వరకు ఆలయ డబ్బులు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది కూడా జాతర అనంతరం డబ్బులను తండాలో అవసరం ఉన్న పలువురికి వడ్డీకి ఇచ్చారు. ప్రతి ఐదు వందల నోట్ల కట్టలో మూడు, నాలుగు నకిలీ నోట్లు ఉన్నట్లు కొందరు గుర్తించారు. ఈ విషయమై పలువురు బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా తండాలోని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.