హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): నకిలీ కాల్ సెంటర్తో బ్రాండెడ్ కంపెనీల వినియోగదారులను మోసం చేసిన ఘటనలో గూగుల్కు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్లో రెండేండ్లుగా మహ్మద్ సలీం, మహ్మద్ అరీఫ్ నకిలీ కాల్సెంటర్ నిర్వహిస్తున్నారు. గూగుల్ను అడ్డాగా చేసుకొని వీరు మోసానికి తెరలేపారు. గూగుల్లో బ్రాండెండ్ కంపెనీల సర్వీసింగ్ సెంటర్ పేరుతో ప్రకటనలిచ్చారు. ఇంతటితో ఆగకుండా అసలైన సర్వీసింగ్ సెంటర్ చిరునామాలు, గూగుల్ మ్యాప్లలో మార్చేశారు. దీంతో వినియోగదారులు గూగుల్ యాడ్లో మొదటగా బ్రాండెడ్ పేరుతో ఉన్న సర్వీసింగ్ సెంటర్ను చూసి దానిపై ఉన్న కాల్సెంటర్ నెంబర్కు ఫోన్ చేసేవారు. ఫోన్ రీసివ్ చేసుకొన్న వ్యక్తులు.. వినియోగదారుడి ఇంటికి టెక్నీషియన్ను పంపిస్తారు. ఆయా వస్తువులు పాడయ్యాయని వాటిస్థానంలో కంపెనీ వస్తువులనే వాడాలని నమ్మించి నకిలీ వస్తువులను అంటకట్టేవారు. వచ్చిన దాంట్లో కాల్సెంటర్ నిర్వాహకుడికి 60%, టెక్నీషియన్కు 40% డబ్బులు పంచుకొనేవారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ప్రకటనల విభాగం ప్రతినిధులు విచారణకు రావాలని సైబర్క్రైమ్ హైదరాబాద్ పోలీసులు సూచించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఈ విషయంపై మార్కెట్లో వెయ్యి రూపాయల విలువైన వస్తువు తెచ్చి, అది బ్రాండెడ్ అని రూ. 6 వేల వరకు కస్టమర్ల వద్ద వసూలు చేసి ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు వెల్లడించారు. 2017లోనే ఈ ముఠా ఇలాంటి మోసాలకే పాల్పడిందని, తిరిగి మరోసారి కాల్సెంటర్ నిర్వాహిస్తూ పట్టుబడ్డారని ఏసీపీ వివరించారు. ఇటీవల వీరి వద్ద నుంచి 555 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొన్నట్టు వివరించారు. నిందితుల విచారణ నిమిత్తం కస్టడీ పిటిషన్ను కోర్టులో దాఖలు చేస్తామని తెలిపారు.