హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): నకిలీ యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు వారి నుంచి రూ. 22.95 లక్షల విలువైన నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఉప్పల్లోని ట్రాకాన్ కొరియర్స్లో తనిఖీలు నిర్వహించగా ఐదు కార్టన్లలో నకిలీ ఔషధాలు బయటపడినట్టు డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్రెడ్డి తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ నుంచి పువ్వాడ లక్ష్మణ్ పేరుతో అవి వచ్చాయని పేర్కొన్నారు. లక్ష్మణ్పై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నట్టు చెప్పారు. దిల్సుఖ్నగర్లోని గోదాములో కార్టన్లను డెలివరీ ఇస్తుండగా లక్ష్మణ్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ద్వారకాపురంలో అతడు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ పేరుతో అక్రమంగా గోదాము నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. యూపీ నుంచి వచ్చిన పార్శిళ్లలో హిమాచల్ప్రదేశ్లోని మెగ్ లైఫ్సైన్సెస్లో తయారైన ‘సెఫోక్సిమ్-సీవీ’ ట్యాబ్లెట్లు 51 వేలు ఉన్నట్టు గుర్తించామన్నారు. అది కూడా బోగస్ కంపెనీయేనని తెలిపారు. ఈ ఆపరేషన్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు బీ లక్ష్మీనారాయణ, కే అన్వేషన్, చంద్రశేఖర్, అనిల్, క్రాంతికుమార్, నాగరాజు పాల్గొన్నారు.