హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్పై ఏకాభిప్రాయం కుదరకుంటే ఆ అంశంలో విఫలమైనట్టేనని కేఆర్ఎంబీ పరిధిలోని రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) తెలంగాణ, ఏపీకి తెలిపింది. ఈ మేరకు గురువారం రెండు రాష్ర్టాల ఈఎన్సీలకు లేఖలు రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్పై సీడబ్ల్యూసీ రూపొందించిన ముసాయిదాపై చర్చించి, సంబంధిత అంశాలను నెల రోజుల్లోగా బోర్డుకు నివేదించేందుకు కేఆర్ఎంబీ ప్రత్యేకంగా ఆర్ఎంసీని ఏర్పాటు చేసిన విషయం విదితమే.
ఈ కమిటీ ఇప్పటికే సీడబ్ల్యూసీ ముసాయిదాపై పలు దఫాలుగా చర్చలు నిర్వహించడంతో తుది సమావేశాన్ని నిర్వహించి, ఇరు రాష్ర్టాల నుంచి ఆమోదం పొందాల్సి ఉన్నది. సెప్టెంబర్ 5నే జరగాల్సిన ఈ సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నది. సోమవారం ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ రెండు రాష్ర్టాల ఇరిగేషన్ అధికారులు హాజరుకాకపోవడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ర్టాలకు ఆర్ఎంసీ తాజాగా లేఖలు రాసింది. తుది సమావేశానికి హాజరుకాకున్నా, ఇరు రాష్ర్టాలు ఏకాభిప్రాయానికి రాకున్నా ఈ అంశంలో విఫలమైనట్టేనని, గత సమావేశాల్లో తెరపైకి వచ్చిన అంశాలనే బోర్డుకు నివేదిస్తామని ఆ లేఖల్లో స్పష్టం చేసింది.