జోగులాంబ గద్వాల : కర్ణాటకలో కాంగ్రెస్కు అధికారమిస్తే అక్కడ ఖజానా ఖాళీ అయిందని, పాలన చేతగాక చేతులెత్తేసారని కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా జేడీఎస్(JDS)జిల్లా అధ్యక్షుడు విరుపాక్ష ఆరోపించారు. శనివారం గద్వాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీలను నమ్మి ఆగం కావద్దని సూచించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని స్పష్టం చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు (Guarantee Schemes) అమలు కావడంలేదని వెల్లడించారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) సర్కారు దివాలా దిశగా నడుస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో గద్దెనెక్కేందుకు ఐదు గ్యారెంటీల పేరుతో మాయ చేసిన, ఆ హామీల అమలులో అట్టర్ ఫ్లాప్ అయిందని దుయ్యబట్టారు. ఇప్పటికీ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదన్నారు.
సవాలక్ష కొర్రీలతో కర్ణాటక సర్కార్ పేదలకు చుక్కలు చూపిస్తుందని, 200 యూనిట్ల వరకు ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్తు ఇస్తామన్న హామీ పక్కన పెట్టి ఎడాపెడా విద్యుత్ కోతలు పెడుతుందని ఆరోపించారు. బియ్యం దొరకడం లేదంటూ ‘అన్నభాగ్య’ స్కీమ్ అమలులో చేతులేత్తేసిందని, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ ఆర్భాటంగా ‘శక్తి’ స్కీమ్ను ప్రారంభించి ఆర్థిక భారంతో అనేక మార్గాల్లో సర్వీసులు రద్దు చేసిందని పేర్కొన్నారు.
నిరుద్యోగ భృతికి సంబంధించిన ‘యువ నిధి’ అయితే అతీగతీ లేదని, ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు రోడ్లెక్కుతున్నారని వాపోయారు. పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులు అప్పుల బాధలు తట్టుకోలేక ఒక రాయచూరు జిల్లాలో 27 మంది రైతులు ఆత్యహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీ పథకాల పేరిట ఆ పార్టీ సరికొత్త నాటకానికి తెరలేపిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఈసారి బీఅర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.